టీడీపీ ప్లాన్ వర్కౌట్ అయిందా?
Sajjala Ramakrishna Reddy: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే సమయంలో తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 76.50 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా నరసరావుపేట, మాచర్లల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు.

ఈ ఉద్రిక్త పరిస్థితులు, పోలింగ్ ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మళ్లీ ఓడిపోతున్నామనే అక్కసుతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అయిదు సంవత్సరాల పాటు సాగిన తమ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం టీడీపీని ఆందోళనకు గురి చేసిందని పేర్కొంది.
వైఎస్ జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, ప్రభుత్వ సానుకూలత ఓటు రూపంలో పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ఎవరికి ఓటు వేయాలనే విషయంపై ఓటర్లు ముందుగానే ఓ స్పష్టతకు వచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై సానుకూలంగా ఉండటం వల్లే ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని చెప్పారు. రాత్రి వరకూ పోలింగ్ బూత్ల దగ్గర క్యూలైన్లో ఉన్నారని గుర్తు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో కత్తిపోట్లతో టీడీపీ నేతలు పోలింగ్ రోజును ప్రారంభించారని సజ్జల విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారని ఆరోపించారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారని,. టీడీపీ మూకలు రిగ్గింగ్కు దిగారని ధ్వజమెత్తారు.
తమ ఓటమి ఖాయమైందనే కారణంతో ఈవీఎంలు ధ్వంసం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని వ్యాఖ్యానించారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications