చంద్రబాబు- పవన్ యాత్రల ప్రభావం ఎంత? వైసీపీ ఆరా: అబ్జర్వర్లకు పిలుపు
అమరావతి: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఏపీ. ఇంకో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తం కావాల్సి ఉంది. మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పలు కార్యక్రమాలతో జనం మధ్యే ఉంటోంది. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఇంటికీ వెళ్తోన్నారు ఆ పార్టీ నాయకులు. క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల శాసన సభ్యులు, ఇన్ఛార్జీలు సైతం విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. నేరుగా ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటోన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల తీరుతెన్నులు, అందులో ఉన్నాయని భావిస్తోన్న లోపాలు, జగన్ సర్కార్పై ఉన్న అభిప్రాయాలను స్వయంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ను తీసుకుంటోన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా తమ దృష్టికి వస్తోన్న సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.
అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉంటోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తోన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి బస్సు యాత్ర పేరుతో విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. రెండు విడతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించారాయన.

ఈ పరిస్థితుల మధ్య- వైఎస్ఆర్సీపీ తాజా వ్యూహాలపై దృష్టి సారించింది. నియోజకవర్గ స్థాయిలో చోటు చేసుకుంటోన్న రాజకీయ సమీకరణాల గురించి ఆరా తీస్తోంది. ప్రత్యర్థి పార్టీలు చేపట్టిన ఈ యాత్రలకు ప్రజల నుంచి లభిస్తోన్న స్పందన ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా- ఇవ్వాళ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు. వారి నుంచి నివేదికలను స్వీకరించనున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థల పనితీరును అడిగి తెలుసుకోనున్నారాయన.

ఈ ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని ఫార్చున్ గ్రాండ్ హోటల్లో ఈ భేటీ ఏర్పాటయింది. వై నాట్ 175పై చర్చిస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేలా ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై అబ్జర్వర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు.












Click it and Unblock the Notifications