ఏపీ మద్యం టెండర్లలో కమిషన్ ఎంతో తెలుసా ?
ఏపీలో ఇవాళ నిర్వహించిన మద్యం టెండర్లు పారదర్శకంగా ఉన్నాయని ప్రభుత్వం ఓవైపు కితాబు ఇస్తుంటే.. మరోవైపు విపక్షాలు మాత్రం వాటిలో భారీగా కమిషన్ చేతులు మారిందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా మద్యం షాపుల వేలం గడువు పెంపు టీడీపీ నేతలు, సిండికేట్ల కోసమేనంటూ ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మద్యం టెండర్లపై సంచలన ఆరోపణలు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మద్యం, ఇసుకను అడ్డదారిలో తన వారికి దోచిపెట్టి, వారి జేబులు నింపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. కూటమి పాలనలో 30 శాతం కమీషన్లు ఇచ్చుకుంటే తప్ప వ్యాపారం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో 43 వేల బెల్ట్ షాపులను మూసేయించి మద్యం వాడకాన్ని తగ్గిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం తాగమని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని వేణు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తెచ్చిన లిక్కర్, ఇసుక పాలసీలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ఆయన తేల్చి చెప్పారు. తమ పార్టీ నాయకులను తప్పుచేయమని తానే ప్రోత్సహించి.. మరలా వారిని కట్టడి చేస్తున్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications