టీడీపీలోకా?: 'చంద్రబాబుకు ఉన్నంత అనుభవం ఆయన సొంతం'
విజయవాడ: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురువారం మాట్లాడుతూ పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి కూడా టీడీపీలో చేరతారనే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గురువారం వైపీసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయుకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి స్పందించారు.
రాజకీయాల్లో చంద్రబాబుకు సమానంగా ఉన్న పెద్దిరెడ్డి ఆయన దగ్గరకు వెళ్లి పనిచేయాల్సిన కర్మ పట్టలేదని అన్నారు. జలీల్ ఖాన్కు మతి భ్రమించి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి టీడీపీలో చేరతారని చెబుతున్నారని విమర్శించారు. నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఏపీ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి నీతి, నియమాలతో కూడిన రాజకీయంచేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. జలీల్ఖాన్ ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని తెలిపారు.

ఎమ్మెల్యే జలీల్ఖాన్ చేసిన అసత్య ఆరోపణలపై కోర్టుకు వెళ్లి పరువు నష్ట దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా గురువారం జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో గురువారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్మెంట్ దొరకడం కష్టమనే అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు.
కానీ, తాను ఇంత వరకు ఆయన అపాయింట్మెంట్ తీసుకోకుండానే కలుస్తున్నట్లు జలీల్ ఖాన్ తెలిపారు. అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబును కలవవచ్చు కానీ.. జగన్ను కలవడం అసాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సారి ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలెవరికీ జగన్ టికెట్లు ఇవ్వరని ఆయన అన్నారు.
కనీసం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఆయన టికెట్ ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. జగన్ ఏదనుకుంటే అదే చేస్తారని, ఎవరి మాటా వినరని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications