జగన్ ఆదేశాలు బేఖాతర్... ఆ ఎమ్మెల్యేపై ఉక్కుపాదం... అనుచరులు స్టేషన్ కు తరలింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించింది. వారం రోజుల క్రితం తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ముఖ్యమంత్రి జగన్ నియమించారు.
ఈ నేపథ్యంలో డొక్కా నియామకాన్ని ఖండించేందుకు మేడికొండూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించేందుకు శ్రీదేవి అనుచరులు సమావేశమయ్యారు. వెంటనే పోలీసులు వచ్చి ఆ సమావేశ నిర్వహణకు అభ్యంతరం తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు.

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు డొక్కా ఇబ్బంది పెట్టేవారు
ఆ తర్వాత శ్రీదేవి వర్గీయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కార్యకర్తలను ఎంతో ఇబ్బంది పెట్టారని, ఆయన్ను అదనపు సమన్వయకర్తగా నియమించడంవల్ల నియోజకవర్గంలో వైసీపీ రెండుగా విడిపోనుందని హెచ్చరించారు. ఆయన్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
డొక్కా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అవసరమనుకుంటే మరో కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించాలని, తాము సహకరిస్తామని కోరారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా శ్రీదేవిని గెలిపించుకున్నామని, ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ హఠాత్తుగా ఇన్ ఛార్జిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

దళిత నియోజకవర్గంలోనే ఎందుకు నియమించారు?
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమన్వయకర్తను నియమించడంవల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. సమావేశంలో మండల వైసీపీ అధ్యక్షులు తాళ్లూరు వంశీ, వర్కింగ్ అధ్యక్షుడు బాజి, వైస్ ఎంపీపీ భవనం రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు ముత్యాల బాలస్వామి, సర్పంచ్ లు పాములపాటి వెంకటకష్ణయ్య, ఆవుల సంజీవరెడ్డి తదితరలుు పాల్గొన్నారు.

పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకే..
ముఖ్యమంత్రే స్వయంగా ఇన్ఛార్జిని నియమించినప్పటికీ ఆయన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నాయకులు మీడియా సమావేశం నిర్వహిచండంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సమావేశం నిర్వహించనీయకుండా అడ్డుకుంది. అయినప్పటికీ వారు తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాడికొండ ఇన్ఛార్జి డొక్కాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరగనీయకుండా అడ్డుకోవడంద్వారా ఆ ఎమ్మెల్యేపై అధిష్టానం ఎంత వ్యతిరేకతతో ఉందో అర్థం చేసుకోవచ్చని, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకే డొక్కాను నియమించారని ఆయన అనుచరులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications