మీ లెక్కల్లో పవన్ కల్యాణ్ అలా - జనం లెక్కల్లో ఇలా..!!
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రసంగంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెర తీసింది. తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ అంగీకరించారాయన. తాను రాజకీయాల్లో విఫలం అయ్యానని స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటైన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న సెమినార్ ఇది.
షర్మిలకు మరో షాక్ - పోలీసుల నుంచి నోటీస్తో..!!
రాజకీయ వేదికలకు భిన్నంగా..
శిల్పకళా వేదికలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగించారు పవన్ కల్యాణ్. సాధారణంగా రాజకీయ వేదికల మీద ఆయన కాస్త ఆవేశంతో ప్రసంగిస్తుంటారు. దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఎక్కడా ఆవేశపడలేదు. 37 నిమిషాల పాటు ఉపన్యసించారు. అనేక అంశాలను ప్రస్తావించారు.. రాజకీయాలతో సహా. చివర్లో అయిదు నిమిషాలు మినహా మిగిలిన ప్రసంగం చాలావరకు ఇంగ్లీష్లో సాగింది.
విఫలం అయ్యానంటూ..
తాను రాజకీయాల్లో విఫలం అయ్యానంటూ పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకు తాను బాధపడట్లేదని స్పష్టం చేశారు. ఈ వైఫల్యంతోనే తన విజయానికి బాటలు పడినట్టుగా పేర్కొన్నారు. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అతను సాధించిన విజయాన్ని ప్రామాణికంగా తీసుకోలేమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తుఫాన్ తరహా పరిస్థితులను తట్టుకుని ఎలా నిలబడ్డాడనేదే ఆ వ్యక్తి సాధించిన తొలి గెలుపుగా తాను భావిస్తానని, అలాంటి వారే తనకు ప్రేరణ అని చెప్పారు.
వైసీపీ దాడి షురూ..
పవన్ కల్యాణ్ చేసిన ఈ ప్రసంగం పట్ల విమర్శలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్పై ట్రోల్స్ షురూ చేశారు. రాజకీయాల్లో విఫలం అయ్యానంటూ పవన్ కల్యాణ్ చెప్పడాన్ని టార్గెట్గా చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.. చురకలు అంటిస్తోన్నారు. జన సైనికులను ఉద్దేశించి కీలక సూచనలూ చేస్తోన్నారు.
ఇప్పటికైనా అర్థం చేసుకోండి..
పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలను జన సైనికులు పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఇప్పుడైనా అర్ధం చేసుకోవాలని ఆయన జన సైనికులకు సూచించారు. పవన్ కళ్యాణ్ను నటుడిగా మాత్రమే పరిగణించాలనే అర్థం వచ్చేలా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. పవన్ కల్యాణ్ అనే నటుడు అంటూ సంబోధించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విఫలం చెందిన వ్యక్తి అని అభివర్ణించారు.
రెండు చోట్లా ఛీత్కారం..
పవన్ కల్యాణ్ను ప్రజలు తిరస్కరించారని నాగార్జున యాదవ్ స్పష్టం చేశారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి రెండు చోట్లా ఛీత్కారాన్ని ఎదుర్కొన్న మనిషి అని పేర్కొన్నారు. తాను ప్రస్తుతానికి మాత్రమే విఫలం చెందిన నాయకుడినని పవన్ కల్యాణ్ చెప్పడం పట్ల నాగార్జున యాదవ్ స్పందించారు. పవన్ తన లెక్కల్లో ప్రస్తుతానికి మాత్రమే విఫల నాయకుడని, జనం లెక్కల్లో మాత్రం ఎప్పటికీ విఫలమేనని వ్యాఖ్యానించారు.