‘జగన్ దీక్షా స్థలి వద్ద ఉద్రిక్తత... భగ్నం చేస్తే నడిరోడ్డుపైనే దీక్ష చేస్తారు’
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 26నుంచి చేపట్టనున్న దీక్షకు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని ఆ పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పోలీసులు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు.
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20వ తేదీనే జిల్లా ఎస్పీని కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షపై సమాచారం అందించామని తలశిల తెలిపారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ దీక్షపై అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. ట్రాఫిక్కు సంబంధించి పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రఘురాం స్పష్టం చేశారు.
దీక్ష ఏర్పాట్లకు ఆటంకాలు కలిగిస్తే నడిరోడ్డుపైనే వైయస్ జగన్ దీక్ష చేస్తారని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ ఉల్ఫ్ గ్రౌండ్ వద్ద దీక్ష చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైయస్ జగన్ దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఒకవేళ దీక్షకు అనుమతి ఇవ్వకుంటే వైయస్ జగన్ జిల్లా కలెక్టరేట్ ముందు అయినా దీక్షకు దిగుతారని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను ఆపేది లేదని అంబటి స్పష్టం చేశారు.
దీక్ష స్థలి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి దీక్షకు గుంటూరు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, దీక్ష చేయాలనుకున్న ప్రాంతానికి సమీపంలో ఆస్పత్రి, విద్యా సంస్థలు ఉన్నాయని, అలాగే 25న బక్రీద్, 27 వినాయక విగ్రహాల నిమజ్జనం ఉన్నందున అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల నిర్ణయంతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. వైయస్సార్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీక్ష అనుమతి కోసం వైసీపీ నేతలు మూడు సార్లు పోలీసులకు లేఖ రాసినప్పటికీ... ఈ ప్రాంతం అనుకూలంగా లేనందున దీక్షకు అనుమతి ఇచ్చేదిలేదని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ దీక్ష చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జగన్ దీక్ష చేయకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, పోలీసుల అనుమతి లేకపోయినా జగన్ దీక్ష చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.