భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసమే పవన్ కల్యాణ్ నర్సాపూర్ సభ: గతానుభవాలివే: వైసీపీ ఏం చెబుతోంది?
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవ్వాళ జనసేన పార్టీ మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించనుంది. మత్స్యకారులకు అండగా నిలవడానికి, వారి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో జనసేన పార్టీ ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొనున్నారు.
Recommended Video
జీవో 217 రద్దు కోసం..
ఇందులో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నరసాపురానికి వస్తారు. చేపల చెరువులపై మత్స్యకారులకు ఎలాంటి అధికారాలు లేకుండా చేస్తూ జారీ చేసిన జీవో 217ను రద్దు చేయాలనేది జనసేన పార్టీ ప్రధాన డిమాండ్. ఈ సభకు సన్నాహకంగా ఇదివరకే మత్స్యకార గ్రామాల్లో అభ్యున్నతి యాత్రను నిర్వహించింది. దీనికి ముగింపుగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
సొసైటీలు దళారుల చేతుల్లో..
మత్స్యకార సొసైటీలన్నీ దళారుల చేతుల్లో నలుగుతున్నాయని, వారికి అనుకూలంగా ప్రభుత్వం జీవో నంబర్ 217ను విడుదల చేసిందనేది జనసేన పార్టీ ఆరోపణ. ఈ జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తోన్నారు. వారికి జనసేన పార్టీ అండగా నిలిచింది. దీనికోసం స్వయంగా పవన్ కల్యాణ్ బరిలో దిగారు. ఈ అభ్యున్నతి సభ ద్వారా- మత్స్యకారులకు తాము ఉన్నామనే భరోసా ఇవ్వనున్నారు.
వైసీపీ విమర్శనాస్త్రాలు..
కాగా- ఈ సభపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలను గుప్పిస్తోన్నారు. దీనికి పవన్ కల్యాణ్ నటించిన సినిమాల విడుదలతో లింక్ పెట్టారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్ కల్యాణ్- ఈ సభను నిర్వహిస్తోన్నారని మండిపడుతున్నారు. భీమ్లా నాయక్ విడుదల సమయంలోనే పవన్ కల్యాణ్కు మత్స్యకారులు గుర్తుకొచ్చారా? అంటూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తోన్నారు. తాను నటించిన ప్రతి సినిమా విడుదల కావడానికి ముందు ఇలాంటి సభలను నిర్వహించారని గుర్తు చేస్తోన్నారు.
సినిమా ప్రమోషన్ కోసమేనంటూ..
2016లో సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భంగా జనసేన పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్.. అనుపమా చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చారని గుర్తు చేశారు. తన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసుకున్న తరువాత చిత్ర పరిశ్రమను వదిలేస్తానంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని, దాన్ని ఆయన ఎప్పుడూ పాటించారని ప్రశ్నిస్తున్నారు. స్టాఫ్కు జీతాలను ఇవ్వలేకపోతున్నానంటూ ఆ సినిమాను ప్రమోట్ చేసుకున్నారని విమర్శించారు.
సినిమా విడుదల సమయంలోనే సభలు..
2017లో కాటమరాయుడు విడుదలకు ముందు- విశాఖపట్నంలో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తానని ప్రకటించి వెనుకంజ వేశారని వైసీపీ నాయకులు విమర్శిస్తోన్నారు. సినిమా విడుదల తరువాత విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులను కలుసుకున్నారని, అదీ సినిమా ప్రమోషన్లో భాగమేనని మండిపడుతున్నారు. అజ్ఞాతవాసిని సినిమా సమయంలోనూ ఆయన ఏపీ సహా తెలంగాణలోని ఖమ్మంలోనూ సభలను నిర్వహించి ప్రమోషన్ చేసుకున్నారని ఆరోపిస్తోన్నారు.
గత ఏడాది వకీల్సాబ్.. ఇప్పుడు భీమ్లా నాయక్..
గత ఏడాది వకీల్ సాబ్ సినిమా రిలీజ్కు ముందు రైతుల అంశాన్ని పవన్ కల్యాణ్ తెర మీదికి తీసుకొచ్చారని, వారికి న్యాయం చేయడానికి వకీల్ సాబ్ వస్తున్నాడంటూ సినిమాను ప్రమోట్ చేసుకున్నారనేది వైసీపీ నాయకులు విమర్శిస్తోన్నారు. సినిమా విడుదలకు వారం రోజుల ముందు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార సభను నిర్వహించారని నిప్పులు చెరుగుతున్నారుు వైసీపీ నాయకులు. ఈ నెల 25వ తేదీన భీమ్లా నాయక్ విడుదల కానుండగా.. ఇప్పుడు నర్సాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ పేరుతో సభను నిర్వహించడంలో అర్థం ఏమిటని నిలదీస్తోన్నారు.