జగన్ కోర్టుకు నర్సాపురం పంచాయితీ- ప్రసాదరాజు వర్గం భేటీ- సుబ్బారాయుడు లేకుండానే
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కాక రేపుతోంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో రెండో జిల్లాగా ఏర్పావుతున్న భిమవరానికి జిల్లా కేంద్రంగా భీమవరాన్నే ఎంపిక చేయడంపై అసంతృప్తిగా ఉన్న నరసాపురం ప్రజలు, నేతలు ఇప్పటికే నిరసనలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ నరసాపురం వైసీపీ నేతలు సీఎం జగన్ ను కలిశారు.
నరసాపురం జిల్లా కేంద్రం కోసం వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం కోసం చేపట్టిన నిరసనల్లో సుబ్బారాయుడు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు స్ధానిక ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించినందుకు ఓసారి తన చెప్పుతో తాను కొట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇవాళ నరసాపురం జిల్లా కేంద్రం కోరుతూ ఇవాళ స్ధానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆధ్వర్యంలోవైసీపీ నేతలు సీఎం జగన్ ను కలిశారు.

కొత్తగా ఏర్పాటయ్యే భీమవరం జిల్లాకు జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ప్రకటించాలని సీఎం జగన్ ను వారు కోరారు. దీంతో జగన్ వారికి పరిశీలిస్తానని హామీ ఇచ్చి పంపారు. సీఎం జగన్ ను కలిసిన వైసీపీ నేతల బృందంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యే కూడా అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రం లేరు. ఎమ్మెల్యే ప్రసాదరాజుతో పలు విషయాల్లో విభేదిస్తున్న ఆయన లేకుండానే మిగతా నేతలు ఇవాళ సీఎం జగన్ ను కలవడం విశేషం. మరోవైపు జిల్లాలో నరసాపురం జిల్లా కేంద్రం వ్యవహారం రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతుండటంతో ఆ విషయాన్ని నేతలు ఇవాళ సీఎం జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రకటించిన భీమవరం జిల్లా కేంద్రాన్ని మారిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications