బాలినేని సీటు మార్పు..! జగన్ రెండో లిస్టు రెడీ - దక్కని వారి రూటెటు..!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల మార్పు మొదలు పెట్టారు. సీట్ల మార్పుతో చోటు చేసుకొనే పరిణామాల కంటే పార్టీ గెలుపే కీలకమని తేల్చి చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు అమలు చేస్తూ..గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని అధికారికంగా ప్రకటించారు. ఎవరిని మారుస్తున్నారో వారితో చర్చలు మొదలయ్యాయి. తాజా జాబితాపైన ఉత్కంఠ నెలకొంది.
జగన్ గెలుపు తంత్రం : ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ చిన్న అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పైన నిర్ణయాలు పార్టీలో సంచలనంగా మారాయి. అయితే, ఎవరినీ మార్చాలనే ఉద్దేశం తనకు లేదని..కానీ, పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని మార్పులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు సీట్లు మార్చి మరో నియోజకవర్గం కేటాయిస్తున్నారు. అదే విధంగా ఇతరుల నియోజక వర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చినా..సీటు కోల్పోయిన వారికి భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని అధికారికంగా ప్రకటించారు. తూర్పు గోదావరిలో జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడులోనూ మార్పులు ఖరారయ్యాయి. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో మార్పులు ఆసక్తి కరంగా మారాయి.

ప్రకాశంలో భారీ మార్పులు : పదకొండు మంది మార్పులతో ఖరారు చేసిన జాబితాలో కొండపికి మంత్రి సురేష్, అక్కడ ఇంఛార్జ్ గా ఉన్న అశోక్ బాబును వేమూరుకు, మంత్రి నాగార్జునకు సంతనూతల పాడుకు మార్పు చేసారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సిద్దా రాఘవరావు, అన్నా రాంబాబు, కరణం బలరాంతో పార్టీ నాయకత్వం మంతనాలు చేసింది. బాలినేని, ఎంపీ మాగంటతో సోమవారం సమావేశం కానున్నట్లు సమాచారం. పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డితో హైదరాబాద్ లో బాలినేని సమావేశమయ్యారు. సిట్టింగ్ లపైన ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ మార్పులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే..మాజీ మంత్రి బాలినేనికి గిద్దలూరు బాధ్యతలు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది.
భవిష్యత్ పై హామీ : మాజీ మంత్రి సిద్దా రాఘవరావును మార్కాపురానికి, చీరాలకు మోపిదేవి లేదా ఆమంచిని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డికి గిద్దలూరు ఇచ్చి బాలినేని, మాగుంట పోటీకి సిద్దంగా ఉంటారనే చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. అదే సమయంలో ఒంగోలు ఎంపీగా బాలినేని పేరును పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అయితే, మార్పుల పైన ఇప్పటికే ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. ఒకరిద్దరితో మినహా ఎక్కడా సమస్యలు లేవని తెలుస్తోంది. భవిష్యత్ పైన ఇస్తున్న హామీలతో వారు సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. టీడీపీ, జనసేన తో పాటుగా బీజేపీ కలిస్తే ఆ మూడు పార్టీల సీట్ల ఖరారులో టీడీపీ ఇంఛార్జ్ లు భారీగా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. దీంతో..రానున్న రోజుల్లో సీట్ల దక్కని వారి రాజకీయం ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications