సదావర్తి భూముల కేసు: రూ. 10 కోట్లు చెల్లించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ
సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహరంలో హైకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తొలివిడతగా రూ. 10 కోట్లను గురువారంనాడు చెల్లించాడు.
హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహరంలో హైకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తొలివిడతగా రూ. 10 కోట్లను గురువారంనాడు చెల్లించాడు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి ఈ మేరకు రూ.10 కోట్లను చెల్లించినట్టు ఆయన మీడియాకు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్కు ఈ వివరాలను అందజేసినట్టుగా ఆయన చెప్పారు. మరో 17 కోట్లను నిర్ణీత గడువులోపుగా చెల్లించనున్నట్టు ఆయన చెప్పారు.
ఈ నెల 17న, సదావర్తిభూముల వేలం కేసులను హైకోర్టు మరోసారి విచారించనుంది. అయితే ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు ఏపీ ప్రభుత్వం ధారాదత్తం చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.ఈ విషయమై ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
రూ.22 కోట్లకు అదనంగా రూ.5 కోట్లను చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తానని ఉన్నతన్యాయస్థానం పేర్కొంది. అదనంగా రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.22 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కె హైకోర్టుకు చెప్పారు.
ఇందులో భాగంగానే తొలివిడతగా రూ.10 కోట్లను రెండువారాల్లో మిగిలిన రూ.17 .44 కోట్లను ఆ తర్వాతి రెండువారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్యే ఆర్కె గురువారంనాడు ఈ నిధులను చెల్లించారు.