వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. రాత్రంతా జీపులో తిప్పారు..సంబంధం లేని పోలీస్ స్టేషన్ కు తరలింపు
చంద్రగిరి: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఓటర్ల సర్వే పేరుతో వచ్చిన కొందరు యువకులను అడ్డుకోవడమే దీనికి కారణం. సర్వేల పేరుతో వచ్చిన యువకులు తమ పార్టీ సానుభూతిపరుల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ చెవిరెడ్డి, ఆయన అనుచరులు ధర్నా చేపట్టారు. దీనికి స్పందించిన పోలీసులు చెవిరెడ్డిని అరెస్టు చేశారు. జీపులో ఎక్కించుకుని, రాత్రంతా పలు గ్రామాల్లో తిప్పారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గానికి దూరంగా, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఉంచారు. దీనిపై చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో, తెలుగుదేశం పార్టీ తనను టార్గెట్ చేసుకుందని ఆరోపించారు. టీడీపీ, పోలీసుల వైఖరిపై తాను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాలకు బైకులు, కార్లల్లో వచ్చిన కొందరు యువకులు శనివారం రాత్రి సర్వే చేపట్టారు. పాకాల మండలంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టిపట్టు ఉంది. పాకాల మండలంలో వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఈ మండల పరిధిలో వైఎస్ఆర్ సీపీకి మెజారిటీ లభిస్తుంది. అలాంటి ప్రాంతంలో సర్వే పేరుతో వచ్చి, పార్టీ సానుభూతి పరుల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణ. పాకాలలో సర్వే చేస్తున్నవారిని అడ్డుకొన్నందున పోలీసులు చెవిరెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేశారు. ఆయనను జీపులో ఎక్కించుకుని రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పారు. తొలుత చిత్తూరు పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం వరకు ఆయన అక్కడే ఉన్నారు.
చంద్రగిరిపై చంద్రబాబు టార్గెట్ ఎందుకు?
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార పార్టీ టార్గెట్ చేయడానికి కారణాలు ఉన్నాయి. చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లె ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. మొదట కాంగ్రెస్ పార్టీకి, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ నియోజకవర్గం. 1999 నుంచి జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వచ్చింది. 1994లో చివరి సారిగా ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది టీడీపీ. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గల్లా అరుణకుమారి తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది.
దీనితో అరుణకుమారి తెలుగుదేశంలో చేరారు. 2014 ఎన్నికల్లో అరుణకుమారి చంద్రగిరి స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి కూడా ఈ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే అంచనా ఉంది.
మరోసారి చెవిరెడ్డి గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ చేపట్టిన సర్వేల్లో స్పష్టమైంది. దీనితో- వైఎస్ఆర్ సీపీకి గట్టి పట్టు ఉన్న మండలాల్లో ఓటర్ల సర్వే పేరుతో పార్టీ సానుభూతి పరుల పేర్లను తొలగింపు కార్యక్రమానికి టీడీపీ పాల్పడిందనే విమర్శలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 14 వేలకు పైగా ఓట్లను తొలగించారని అంటున్నారు. ఈ సారి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో.. వైఎస్ఆర్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు టీడీపీ పాల్పడుతోందనే విమర్శలు ఉన్నాయి. ఒక్క చంద్రగిరి నియోజకవర్గం మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఇలాంటి దొంగ సర్వేలకు పాల్పడుతోందని, సర్వేల పేరుతో ప్రతిపక్ష పార్టీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా మరోసారి వైఎస్ఆర్ సీపీకి పట్టు ఉన్న పాకాల మండలంలో సర్వే చేపట్టడాన్ని చెవిరెడ్డి అడ్డుకున్నారు. అడ్డుకున్నందుకు అరెస్టు చేసి, సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.