టీటీడీ ఉద్యోగిపై వైసీపీఎమ్మెల్యే అనుచరుడి దాడి: జగన్ సర్కార్ పై లోకేష్, సోమువీర్రాజు మండిపాటు
తిరుమలలో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు టీటీడీ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు టీటీడీ ఉద్యోగిపై గది కోసం దాడి చేసి వీరంగం వేసిన ఘటన నేపధ్యంలో అధికార వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు .
తిరుమలలో గది కోసం వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకం.. టీటీడీ ఉద్యోగిపై దాడి
తిరుమలలో తనకు గది కావాలంటూ అధికారులపై దాడికి పాల్పడ్డాడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు. తనను అడ్డదారిలో అనుమతించాలంటూ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. దీనికి అధికారులు అనుమతించకపోవడంతో ఎంబీసీ కౌంటర్ వద్ద టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం పై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన వెంకటరత్నం తనపై జరిగిన దాడి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి పై ఎమ్మెల్యే అనుచరుడి దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు కారణంగా మారింది.
వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని నారా లోకేష్ ఫైర్
తాజాగా తిరుమలలో టిటిడి ఉద్యోగిపై దాడి జరిగిన ఘటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో దెబ్బతీస్తోంది వైసిపి ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారు వైయస్ జగన్ అంటూ నారా లోకేష్ నిప్పులు చెరిగారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులకు గురిచేశారు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులకు, సిబ్బందికి రక్షణ లేకపోవటం ప్రభుత్వ వైఫల్యం
ఇక ఇదే సమయంలో ఇప్పుడు ఏకంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే అనుచరుడు తనకి గది కేటాయించలేదు అంటూ టిటిడి ఉద్యోగిని దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేసాడు అని పేర్కొన్న లోకేష్, టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని స్పష్టం చేశారు. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించ లేకపోవడం టిటిడి, ప్రభుత్వ వైఫల్యమే అని లోకేష్ తేల్చిచెప్పారు. టిటిడి సిబ్బంది పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటూ లోకేష్ వెల్లడించారు.
టీటీడీ ఉద్యోగిపై దాడి ఘటన.. సోము వీర్రాజు స్పందన
ఇదిలా ఉంటే టిటిడి ఉద్యోగిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించాలని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడికి టిటిడి అండగా నిలవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. టీటీడీలో ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలు పెరిగిపోతున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే టిటిడి ఉద్యోగిపై దాడి చేసిన ఘటనలో టిటిడి ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిటిడి ఉద్యోగుల కమిటీ డిమాండ్ చేస్తుంది.












Click it and Unblock the Notifications