పీకే అంటే పవన్ కాదు పిచ్చి కుక్క.. వైఎస్ భారతి జోలికొస్తే దేహశుద్ధే.. ఇంటికొచ్చి తోకలు కత్తిరిస్తాం
''ఏబీసీడీలు కూడా రాని టీడీపీ వెధవలందరూ సీఎం జగన్ ను, ఆయన కుటుంబాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ప్రజలు చెంపచెళ్లుమనిపిస్తే నాలుగు నెలలపాటు కుక్కినపేనుల్లా బొక్కల్లో పడుకున్న టీడీపీ వాళ్లు మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి చెత్తవాగుడు వాగుతున్నారు. చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుకోవడమే దండగ''అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులపై టీడీపీ, జనసేన రివర్స్ మాటలతో తప్పించుకోవాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పవన్, టీడీపీ నేతలు ఒక్కొక్కరినీ ఒక్కో పేరుతో పోల్చుతూ జోగి రమేశ్ ఏమన్నారంటే..
Recommended Video


ఈసారి నోరు జారితే ఇంటికొచ్చి తంతాం..
‘‘దేవినేని ఉమ అనేవాడు పెద్ద సొల్లుగాడు. నాలుగు నెలలు కుక్కలాగా పడుండి, ఇప్పుడు మీడియాలో రెచ్చిపోతున్నాడు. పోలవరం కట్టింది ఎవడ్రా? అని అడుగుతాడా? ముఖ్యమంత్రిని ఉద్దేశించి రా అని సంబోధించడానికి ఎంత ధైర్యం? ఏయ్.. దేవినేని ఉమ.. ఇంకోసారిగానీ నోరు జారితే.. నీ ఇంటికే వచ్చి తోక కత్తిరిస్తా జాగ్రత్త..

ఆంబోతులు.. కుక్కలు..
టీడీపీ నేతల తీరు ఎలా ఉందంటే.. ఒకరేమో బుద్ధి లేని లొల్లి వెంకన్న.. ఇంకొకరు సొల్లు ఉమ.. మెదడులేని మేధావి యనమల రామకృష్ణుడు.. అచ్చోసిన ఆంబోతు అచ్చెంనాయుడు.. లోకజ్ఞానం లేని నారా లోకేశ్.. బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి. పొద్దునలేస్తే కారు కూతలు కూస్తోన్న వీళ్లందరికీ త్వరలోనే గట్టి షాక్ తగులుతుంది. ఐటీ దాడుల్లో చంద్రబాబు అక్రమాలన్నీ బయటికొస్తాయి.

సూట్ కేసుల్లో డబ్బులుంటాయా?
ఐటీ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఏ అడ్డంగా దొరకిపోతే దాంతో సంబంధంలేదని టీడీపీ నేతలెలా చెబుతారు? రూ.2వేల కోట్ల అక్రమాలపై దేశమంతా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ స్పందించరేం? ప్రెస్ మీట్ లో సూట్ కేసులు చూపించి ఇందులో డబ్బులు పడతాయా? అని టీడీపీ నేతలు చౌకబారు కూతలు కూస్తున్నారు. డబ్బులు సూట్ కేసుల్లోకాదు.. సూట్ కేస్ కంపెనీల ద్వారా దారిమళ్లాయని ఐటీ శాఖనే చెబుతోంది.

మీకు పీకే.. నాకు అదే..
టీడీపీ నేతలకు తోడుగా చంద్రబాబు తాబేదారు పీకే కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. పీకే అంటే అందరికీ పవన్ కల్యాణ్ కావొచ్చేమో.. నాకు మాత్రం పీకే అంటే పిచ్చి కుక్కే. కరోనా వైరస్కైనా మందు కనిపెట్టారేమోగానీ.. ఈ పీకే లాంటి పిచ్చికుక్కల్ని నివారించడానికి మందు రాలేదింకా. బీజేపీతో వైసీపీ కలిస్తే నేను దూరమైపోతానని పవన్ అంటున్నాడు. అసలు ఎన్డీఏలోకి వైసీపీ చేరుతుందని ఆయనకు ఎవరు చెప్పారు? రాజధాని రైతులకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ చెత్తవాగుడేంటి? దేశం మొత్తాన్ని ఊపేస్తున్న ఐటీ దాడులపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ మాటలకు, చేతలకు పొంతనే ఉండదు. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్'' అని జోగి రమేశ్ అన్నారు.

వైఎస్ కుటుంబం జోలికి రావొద్దు..
రాజకీయపరంగా సద్విమర్శల్ని వైసీపీ స్వీకరిస్తుందికానీ, దురుద్దేశంతో టీడీపీ నేతలు చేస్తోన్న కామెంట్లను మాత్రం సహించబోమని ఎమ్మెల్యే జోగి అన్నారు. సీఎం సతీమణి వైఎస్ భారతి గురించి అవాకులు చెవాకులు రాసినా, మాట్లాడినా టీడీపీ నేతల తాటతీస్తామని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో టీడీపీ నేతలు తప్ప మిగతా అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశ ప్రధానితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం కావడంపైనా రాద్ధాంతం చేస్తోన్న టీడీపీ నేతలు పిచ్చికుక్కల్లా తయారయ్యారని జోగి విమర్శించారు.












Click it and Unblock the Notifications