అలిగిన వేళ.. వెంకయ్య నాయుడిని కలిసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!!
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోన్నారు. వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్ర ఉన్న ఆయన- మొన్నీ మధ్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జిల్లా అధికార యంత్రాంగంపై తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆయనను వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.
ఏపీలో ఆందోళనకరంగా- ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ: తేల్చేసిన జాతీయ సర్వే..!!
ఫైర్ బ్రాండ్..
కోటంరెడ్డికి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. తన వైఖరితో అధికార యంత్రాంగానికి చుక్కలు చూపిస్తుంటారు. పనులు చెయ్యని అధికారులపై ఎలాంటి మొహమాటం లేకుండా, విమర్శనాస్త్రాలను గుప్పించడానికీ వెనుకాడరు.
అధికారులపై..
అధికారుల వైఖరిని నిరసిస్తూ కొద్దిరోజుల కిందటే తన నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంట మురుగునీటి కాల్వలో బైఠాయించిన విషయం తెలిసిందే. మురుగునీటి కాల్వ సమస్యను పరిష్కరించాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తోన్నామని, అయినప్పటికీ అధికారులు ఏదో ఒక సాకుతో దాటవేస్తోన్నారంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందంటూ అప్పట్లో ధ్వజమెత్తారు.
అభివృద్ధి పనులపై..
జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలోనూ ఆయన అదే వైఖరిని ప్రదర్శించారు. అధికార యంత్రాంగంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పైనా విమర్శలు గుప్పించారు. నిధులను సకాలంలో మంజూరు చేయట్లేదని, ఫలితంగా తన నియోజకవర్గం పరిధిలో రోడ్ల మరమ్మతు, ఇతర అభివృద్ధి పనులు స్తంభించి పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్నే వివరణ..
ఈ పరిణామాల మధ్య కోటంరెడ్డిని వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గానికి విడుదల చేస్తోన్న నిధుల లోటు లేనప్పటికీ- ఎందుకు అసంతృప్తి గళాన్ని బాహటంగా వినిపించాల్సి వచ్చిందనే విషయంపై జగన్ ఆరా తీశారని అంటున్నారు. దీనికి గల కారణాలను ఆయన ముఖ్యమంత్రికి వివరించారని, అధికార యంత్రాంగంపై చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు.
వెంకయ్యనాయుడితో భేటీ..
ఈ పరిణామాల మధ్య తాజాగా- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉదయం వెంకయ్య నాయుడి నివాసానికి వెళ్లారాయన. ఇది మర్యాదపూరక భేటీగా కోటంరెడ్డి అనుచరులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అత్యంత సీనియర్ కావడం వల్ల మర్యాదపూరకంగా కలిశారని, వారిద్దరి మధ్య ఎలాంటి రాజకీయాల ప్రస్తావన రాలేదని అంటున్నారు.