తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పార్టీ ఫిరాయింపుపై నూజివీడు ఎమ్మెల్యే
అమరావతి: తాను టీడీపీలో చేరనున్నట్లు మీడియా వస్తున్న వార్తలపై నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పందించారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తాము పార్టీ మారే ఆలోచనే లేదన్నారు. ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి క్యూ కడతారని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి కుడితో పడిన ఎలుకల్లా తయారైందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు కొందరు తనతో మాట్లాడారని వైసీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు వచ్చామా? అని ఇప్పుడు బాధపడుతున్నారని ఆయన అన్నారు. కాగా, కృష్ణా జిల్లా టీడీపీ బచ్చుల అర్జునుడు నూజివీడులో పర్యటించిన సందర్భంగా బుధవారం జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
జగన్కు 'కృష్ణా' షాక్: టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు?వీరిలో జిల్లాలోని తిరువూరు, నూజివీడు, పామర్రు ఎమ్మెల్యేలుగా ఉన్న రక్షణ నిధి, మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పనలు ఉన్నారన్నార. ఈ వ్యాఖ్యలపై గురువారం నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లు దక్కాయి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీలోకి చేరారు. దీంతో ఆ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' లో భాగంగా వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.