జగన్కు 'కృష్ణా' షాక్: టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు?
అమరావతి: ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' మరోసారి తెరలేవనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ టికెట్పై విజయం సాధించిన 20 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత వైయస్ జగన్ నానా తంటాలు పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో మొన్నటిదాకా కాస్తంత బలంగా కనిపించిన వైసీపీ ఫిరాయింపులతో ప్రస్తుతం బలహీనపడిపోయింది.
తాజాగా వైసీపీకి పట్టున్న జిల్లాగా పేరుగాంచిన కృష్ణా జిల్లాలోనూ వైసీపీ మరింత బలహీనపడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ మేరకు ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. జిల్లాలోని నూజివీడులో పర్యటించిన సందర్భంగా బుధవారం అర్జునుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో నూజివీడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని అర్జునుడు చెప్పడంతో వైసీపీ నేతలు కాస్తంత కంగారు పడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లు దక్కాయి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీలోకి చేరారు. దీంతో ఆ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. టీడీపీలోకి చేరినప్పటి నుంచి వైసీపీ అధినేత వైయస్ జగన్కు ఆయన సవాల్ విసురుతూనే ఉన్నారు.
కాగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చెప్పిన ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే, ఇక వైసీపీకి తరుపున పార్టీలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉంటారు. అర్జునుడు చెబుతున్న దాని ప్రకారం జిల్లాలోని తిరువూరు, నూజివీడు, పామర్రు ఎమ్మెల్యేలుగా ఉన్న రక్షణ నిధి, మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పనలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న వీరు ఇప్పటికే వారి డిమాండ్లను జిల్లాకు చెందిన టీడీపీ నేతల ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీటిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం ఖాయమేనని అర్జునుడు చెప్పుకొచ్చారు.
ఇదే గనుక జరిగితే కృష్ణాజిల్లా నుంచి వైసీపీ తరుపున కేవలం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) మాత్రమే మిగులుతారు.












Click it and Unblock the Notifications