అల్లుడు వస్తాడు.. వెళ్తాడు.. నష్టమేమీ లేదు: లోకేష్ పై ఎమ్మెల్యే రాచమల్లు సెటైర్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తయ్యింది. నారా లోకేష్ వంద రోజుల పాదయాత్ర సందర్భంగా నారా వారి కుటుంబం, నందమూరి కుటుంబం నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ తల్లి నారా భువనేశ్వరి లోకేష్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
నిన్నటితో 100 రోజులు పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు నారా లోకేష్ తో కలసి కదంతొక్కారు. అయితే తాజాగా లోకేష్ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్రతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.

పాదయాత్ర రెండు రోజులైనా 1000 రోజులైనా ఈ రాష్ట్ర ప్రజలకు చేకూరే లబ్ధి ఏమీ లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. తండ్రి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ పాదయాత్ర వల్ల నయాపైసా ప్రయోజనం కూడా ఉండదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించిన ఆయన, ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ ఏమీ చేయలేదని నారా లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరుకు లోకేష్ వస్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదని, అతని పాదయాత్రకు అంత ప్రయారిటీ లేదన్నారు. లోకేష్ పాదయాత్రతో తనకు వచ్చే నష్టమేమీ లేదని, అల్లుడిలా వస్తాడు వెళ్తాడు అంటూ ఎమ్మెల్యే రాచమల్లు సెటైర్లు వేశారు.
ఇప్పటివరకు లోకేష్ పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక్క నాయకుడు అయినా టిడిపిలో చేరారా అంటూ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినా తాను అడ్డుకుంటే అనవసరమైన మైలేజ్ ఇచ్చినట్లుగా ఉంటుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరో ఒకరిని రోజు తీసుకువచ్చి పాదయాత్ర సక్సెస్ అయిందని చూపించు కుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications