మహిళా మంత్రులపై రోజా సంచలన వ్యాఖ్యలు, 'జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారా'
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం ఏపీ మహిళా మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'జగన్కు మరికొంతమంది షాకిస్తారు'
Recommended Video
ఏపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మహిళలపై దాడులు జరిగినా ఏపీ మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలోని పెందుర్తిలో ఓ మహిళను భూకబ్జాకోరులు వివస్త్రను చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి రాస్తే రామాయణమంతా, వింటే భారతమంత అన్నారు.
ఇక్కడి మరుగుదొడ్లకు బెంగళూరు అకౌంట్లకు నిధులు
వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇసుక, మట్టి, గ్రానైట్ ఏ ఒక్కదానిని వదలడం లేదని మండిపడ్డారు. ఇక్కడ కట్టుకున్న మరుగుదొడ్లకు బెంగళూరులో బ్యాంకు అకౌంట్లకు నిధులు విడుదల అవుతున్నాయన్నారు. జిల్లాలో విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు మూసివేశారో చెప్పకుండా విమర్శలు సరికాదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే విజయ డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామన్నారు.
సిగ్గుపడే చర్య
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా మాట్లాడారు. పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచి దళితులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలన్నారు.
ఒకే తారీఖున పుట్టిన హిట్లర్, బాబు
ఒకే తారీఖున పుట్టిన వారు ఒకేవిధంగా వ్యవహరిస్తారని బొత్స అన్నారు. హిట్లర్, చంద్రబాబు ఒకే తేదీన పుట్టారని, ఇద్దరు నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్పై చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. జగన్పై ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. 2004 నుంచి దివంగత వైయస్ ఎన్నో మంచి పనులు చేసి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా
ప్రతిపక్ష పార్టీని అణిచివేయాలని అధికార పార్టీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార పార్టీ దుష్ట పాలన సాగిస్తోందన్నారు. ఎమ్మెల్యేలను కొంటూ రాజ్యాంగాన్న అవహేళన చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.