ఏడాది పాటు సస్పెండ్ చేస్తారా?: రోజా, చంద్రబాబు పైత్యం పరాకాష్టకు: ఆర్కే
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ఆమె తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె జన్మభూమి కార్యక్రమం ఆర్భాటపు ఖర్చు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
గత జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులనే ఇప్పటి వరకు ప్రభుత్వం పరిష్కరించలేదని ఆమె ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తన సస్పెన్షన్పై సీఎంపై వ్యాఖ్యలు చేస్తే ఏడాది పాటు సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. గత పదేళ్లలో టీడీపీ వాళ్లు చేసేందేమిటని ఆమె ఈ సందర్భంగా నిలదీశారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో టీడీపీ ప్రచారం చేసిందని గుర్తు చేసిన ఆమె, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా, జాబులెక్కడ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.
విరాళాల విషయంలో చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది: ఆర్కే
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి విరాళాల విషయంలో సీఎం చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని కోసం విరాళాలు సేకరించే విషయంలో ఆయన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.
చివరికి స్కూలు పిల్లల నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని, దీనిని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదని ఆయన విమర్శించారు. స్కూళ్లలో అట్టడుగు వర్గాలకు చెందినవారి పిల్లలు కూడా ఉంటారని వారి నుంచి కూడా విరాళాలు సేకరించాలని ప్రయత్నించడం దుర్మార్గం అని అన్నారు.
ఇలా చేయడం కంటే, ప్రతిపక్ష నేతలు, మేధావులతో మాట్లాడి రాజధాని ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేయాలో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సూచించారు.