ఫైబర్నెట్పై కదులుతోన్న డొంక: అట్నుంచి నరుక్కొస్తోన్న జగన్: వైసీపీ ఎమ్మెల్యే సంస్థ ఫిర్యాదు
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్టుగా అనుమానిస్తోన్న ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ అక్రమాలపై డొంక కదిలే పరిస్థితి నెలకొంది. ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా ఓ కీలక అడుగు ముందుకు పడింది. ఫైబర్నెట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంస్థపైనే కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
రూటు మార్చిన వైఎస్ జగన్: ఎమ్మెల్యేలు, ఎంపీలతో వరుస భేటీ: అసంతృప్తులపై: సోషల్ మీడియాతోనూ
ఏపీ ఫైబర్నెట్పై ఫిర్యాదు చేసిన ప్రైవేటు సంస్థ
ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ సంస్థపై పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ మరెవరిదో కాదు.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రావుకు చెందిన కంపెనీ ఇది. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి మద్దిశెట్టి వేణుగోపాల్ రావు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. గత ఏడాది ముగిసిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయం సాధించారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ రావు పారిశ్రామికవేత్త.
ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ ఆధీనంలో..
రాష్ట్రంలో తక్కువ ధరకు అత్యధిక స్పీడుతో ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ను కల్పించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఫైబర్నెట్. దీన్ని పర్యవేక్షించడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోంది. ఇంటింటికి ఇంటర్నెట్ వసతిని కల్పించడానికి అవసరమైన పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడం.. వాటిని పర్యవేక్షించడం ఈ సంస్థ ప్రధాన విధులు.
తక్కువకే కోట్ చేసినా..
ఇంటింటికీ ఇంటర్నెట్ వసతిని కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి 2017లో ఏపీ ఫైబర్ నెట్ సంస్థ అధికారులు టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. మద్దిశెట్టి వేణుగోపాల రావుకు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా బిడ్డింగుల్లో పాల్గొంది. ఈ పనులు ఆ సంస్థకు దక్కలేదు. టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ ఈ కాంట్రాక్టు పనులను దక్కించుకుంది. అన్నిరకాలుగా అర్హతలు ఉన్న తమ కంపెనీకి కాకుండా అనుభవం లేని టెరా సాఫ్ట్వేర్ సంస్థకు కాంట్రాక్టు దక్కడం పట్ల అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేసింది పేస్ పవర్ సిస్టమ్స్ యాజమాన్యం.
దక్షిణ కొరియా సంస్థ కూడా ఫిర్యాదులు.
ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనడానికి మరొక సాక్ష్యాన్ని చూపిస్తున్నారు వైసీపీ నాయకులు. దక్షిణ కొరియాకు చెందిన డసాన్ నెట్వర్క్ సొల్యూషన్స్ సంస్థ కూడా ఏపీ ఫైబర్నెట్పై ఫిర్యాదులు చేసింది. బిడ్డింగుల ప్రక్రియలో తమపై వివక్షను చూపారంటూ డసాన్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఆప్టికల్ లైన్ టెర్మినల్ (ఓఎల్టీ) బిడ్డింగుల ప్రక్రియలతో తాము ఎల్1గా నిలిచినప్పటికీ.. తమను కాదని ఇతరులకు దీని పనులను అప్పగించారంటూ డసాన్ ఫిర్యాదు చేసింది.
సీబీఐకి అప్పగించాలంటూ
ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా జగన్ సర్కార్ అనుమానిస్తోంది. ఏపీ ఫైబర్నెట్ స్కామ్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ఇదివరకే నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం 850 కోట్ల రూపాయల మేర చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో- ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన సంస్థే ఫిర్యాదు చేయడంతో ఇక దర్యాప్తు ప్రారంభం కావడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు.
టీడీపీ నేతల ప్రమేయం..
ఇదివరకే ఈఎస్ఐ స్కామ్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడు, ప్రైవేటు బస్సుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ అరెస్టు అయ్యారు. తాజాగా- ఏపీ ఫైబర్నెట్ వ్యవహారంలో ఇంకెవరు అరెస్టు అవుతారనేది చర్చనీయాంశమౌతోంది. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ఆరంభిస్తే.. అది ఎక్కడి దాకా వెళ్తుందోననే గుబులు టీడీపీ నేతల్లో వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు.