ప్రాణాలైనా తీసుకుంటా! టిడిపిలో చేరను: సీఎం రమేష్ Vs ప్రసాద్రెడ్డి
కడప: అధికార తెలుగుదేశం నాయకుల కుయుక్తులు, కుతంత్రాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరూ లొంగరని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి తేల్చి చెప్పారు. టిడిపిలో చేరాల్సివస్తే ప్రాణాలైనా త్యజిస్తాను కానీ, ఆ పని చేయను అని ఘాటుగా స్పందించారు.
కడపలో మంగళవారం జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు రాచమల్లు ప్రసాద్రెడ్డి ఘాటుగా స్పందించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని వ్యతిరేకించలేదని, చంద్రబాబును పొగడలేదని తెలిపారు.
తెలుగుదేశం అంటేనే అసహ్యం వేస్తోందని అన్నారు. రాజంపేట వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల మెప్పు పొందడానికి అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడరాదన్నారు. అలా చేస్తే లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లెలో ఇటీవల అధికారికంగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా తాను పాల్గొన్నానని తెలిపారు.
స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతల జోక్యంతో కొందరు ఆ శిలాఫలకాన్ని పగులగొట్టడమే గాక, తమపై తప్పుడు కేసులు పెట్టించారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, జిల్లా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో కేవలం ఒక టిడిపి ఎమ్మెల్యేనే గెలిచినా, ఆయనతోపాటు ఇతర ఓటమిపాలైన నేతలే ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కడప జెడ్పీ సమావేశంలోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వరదరాజుల రెడ్డిని సభావేదికపై కూర్చొబెట్టడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ సమయంలో వరదరాజుల రెడ్డికి మర్యాదలు చేయడాన్ని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సమర్ధించుకున్నారు. వరదరాజుల రెడ్డి టీడీపీ వ్యక్తి కాబట్టి తాము సపోర్టు చేస్తామని బహిరంగంగానే చెప్పారు. గతంలో రోజా, హరికృష్ణ సమక్షంలో ప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో చంద్రబాబు దేవుడని పొగిడి.... ఇప్పుడు మాత్రం టీడీపీ పనికిమాలిన పార్టీ అని విమర్శిస్తావా? అంటూ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తాను ఏనాడు చంద్రబాబును మెచ్చుకోలేదని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణాలైనా తీసుకుంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు. దరిద్రులు తప్ప మరెవరూ టీడీపీలో చేరరన్నారు. టీడీపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలు తమపై పనిచేయబోవని తేల్చి చెప్పారు.