'తీరు మార్చుకోకపోవడం వల్లే స్పీకర్పై అవిశ్వాసం', 'ఏపీకి 25 మంది ఐపీఎస్లు'
అమరావతి: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని, ఆయన తీరు మార్చుకోకపోవడం వల్లే అవిశ్వాస తీర్మాన నోటీసులిచ్చామని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ కోడెలపై వ్యక్తిగత ద్వేషంతో అవిశ్వాసం పెట్టారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి కుట్రపూరితంగా స్పీకర్ కోడెల వ్యవహరించారని అన్నారు. అదే విధంగా అసెంబ్లీ ప్రోసీడింగ్ వీడియోలు తమకు ఇచ్చినవి ఒకలా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ నేతలకు ఇచ్చినవి మరోలా ఉన్నాయని చెప్పారు.
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు, బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బచ్చయ్య చౌదరి తదితరుల వ్యాఖ్యలను సోమవారం శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అసభ్యకరమైన కామెంట్లు రికార్డుల నుంచి ఎందుకు తొలగించడంలేదని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎడిటెడ్ వీడియోలు సోషల్ మీడియాకు రిలీజ్ చేశారని ఆయన మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణాపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.
ఏపీకి 25 మంది ఐపీఎస్లను కేటాయించండి: డీజీపీ
ఐపీఎస్ కేడర్ కేటాయింపు సమీక్షా సమావేశానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు హాజరయ్యారు. అనంతరం ఐబీ చీఫ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఏపీ డీజీపీ రాముడు సోమవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు అదనంగా 25 మంది ఐపీఎస్లను కేటాయించాలని కోరారు.
ఏపీలో పోలీసు సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరినట్లు ఆయన చెప్పారు. 2 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రానికి అదనంగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.