తెలియదు: భూమాపై ఎస్వీ మోహన్ రెడ్డి, టిడిపిలోకి రేపు 40మంది!
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న వార్తల పైన వైసిపి మరో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు స్పందించారు.
భూమా, ఆయన కూతురు అఖిల తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న సమాచారం తమ వద్ద ఏదీ లేదని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు కాకుండా అధికారులు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసిపిలో ఉంటే నష్టపోయేది, టిడిపిలోకి వెళ్తే వచ్చేది ఏమీ ఉండదని చెప్పారు. తాను వైసిపిని వీడే ప్రసక్తి లేదని చెప్పారు.
జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే యత్నం
వైసిపి అధినేత జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ శుక్రవారం ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగా చూశాయని, కొంతమంది సీఎంలు కాపు జాతికి అన్యాయం చేశారని ఆరోపించారు. కాపు జాతి హీనమైన దుర్భరస్థితిలో ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 25న ఏలూరులో కాపు రుణమేళా జరగనుందని తెలిపారు. అర్హులైన కాపులు రేపు అనగా.. శనివారం సాయంత్రం లోగా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టిడిపిలోకి 40 మంది గుంటూరు జిల్లా సర్పంచ్లు
ఏపీలో తెలుగుదేశం పార్టీ వైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. నలభై మంది గుంటూరు జిల్లా సర్పంచులు సైకిల్ ఎక్కబోతున్నారు. శనివారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారు టిడిపిలో చేరనున్నారు. సర్పంచులతో పాటు మరికొందరు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.