దాడి: బాబుపై శ్రీకాంత్, 'బాలకృష్ణేనేమో అమ్మాయి కనిపిస్తే ముద్దంటాడు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోలగట్ల వీరభద్ర స్వామి, ఆళ్ల రామకృష్ణా రెడ్డిలు ఆదివారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజాలు వెలికి తీస్తే ఎదురు దాడి ఏమిటని ప్రశ్నించారు.
తాము రాజధానికి వ్యతిరేకం కాదని, కానీ చంద్రబాబు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకమన్నారు. బ్రాహ్మణీ స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఏం పిచ్చోళ్లు కాదన్నారు. చంద్రబాబు కేంద్రానికి ఒక్క పైసా లెక్క చెప్పడం లేదన్నారు.
రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పక్కన పెట్టి నారాయణ కమిటీ వేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబు రాజధానిలోని భూదందా గురించి మాట్లాడకుండా భూములు కొంటే తప్పేమిటని చెప్పడం విడ్డూరమన్నారు. రాజధాని అభివృద్ధి పట్ల బాబు చిత్తశుద్ధి ఏపాటిదో ప్రజలకు తెలిసిందన్నారు.

టిడిపి నేతలు భూములు కొనకుంటే వెబ్ సైట్ ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. భూదందా గురించి మాట్లాడకుండా భూములు కొంటే తప్పేమిటని ఎదురు దాడి విడ్డూరమన్నారు. అమాయక రైతులను మోసం చేసి ల్యాండ్ పూలింగ్ చేశారన్నారు.
బాబు తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. సిబిఐ విచారణ కోరవచ్చు కదా అన్నారు. విలేకరులను బెదిరించడం మాని సిబిఐ విచారణ జరిపించుకోవాలన్నారు. రాజధాని విషయంలో ముందే లీకులుచ్చి టిడిపి నేతలు భూములు కొనేలా ప్లాన్ చేశారన్నారు.
దీనిని సాక్షి పత్రిక వెలుగులోకి తెస్తే ప్రాసిక్యూట్ చేస్తారా, పోలీసులతో వేధిస్తారా అని మండిపడ్డారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు విషయంలో తప్పులు జరిగాయని టిడిపి నేతలు ఆరోపిస్తే వైయస్ రాజశేఖర రెడ్డి సిబిఐ విచారణ వేయించుకున్నారన్నారు.
భూములు కొన్నట్లు బాబు ఒప్పుకున్నారు: కోలగట్ల
రాజధాని ప్రాంతంలో భూములు కొన్నట్లు చంద్రబాబు ఒప్పుకున్నారని వైసిపి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. రాజధాని సమాచారం మీ నేతలకు చెప్పడం వల్లే అఖ్కడ భూములు కొన్నారన్నారు. లింగమనేని భూములు మీకు వద్దు కానీ.. పేదల భూములు లాక్కుంటారా అని ప్రశ్నించారు.
మీరు ఉంటుండటంతో లింగమనేని అతిథి గృహం.. అక్రమం నుంచి సక్రమం అయిందా అని నిలదీశారు. చంద్రబాబు దిగిపోతేనే జాబ వస్తుందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు వైఖరితో ఏపీలో అన్ని జూట్ మిల్లులు మూతబడ్డాయని, వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
మరో వైసిపి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టిడిపి నేతలు మహిళలకు గౌరవం ఇవ్వరన్నారు. మొన్న చంద్రబాబు మనవడిని ఇస్తానంటే ఏ అత్త అయినా వద్దంటుందా అని చెప్పి మహిళలపై వ్యతిరేకత రుజువు చేసుకున్నారని, ఇప్పుడు బాలకృష్ణనేమో.. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలంటాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications