బిజెపిలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు: మంత్రి
అమలాపురం: రాష్ట్రంలో తమ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రచండశక్తిగా ఆవిర్భవిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
ఫ్యాను గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలు చాలామంది త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు మంత్రి సూచనప్రాయంగా తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ‘మోడీ వంద రోజుల పాలన'పై సోమవారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బిజెపిలో వస్తున్నారని, ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నట్టు చెప్పారు.
గత ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేశాయి. ఆ తర్వాత ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా బిజెపి ఎమ్మెల్యేలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కాయి.