జగన్ అలా- వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా - ఫిర్యాదులు మాత్రం కామన్...
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య 700 దాటిపోయింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించి భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నా పలుచోట్ల పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం ఇవేవీ పట్టనట్లుగా రాష్ట్రంలో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. వీరి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భయాలు ఉన్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల టూర్లు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ ఎక్కువవుతున్నా ఇవేవీ పట్టకుండా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం యథేచ్చగా తమ పని తాము చేసుకుపోతున్నారు. మొన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రాయలసీమ వర్సిటీలో తిరిగిన వివాదం సద్దుమణగకముందే, నగరి ఎమ్మెల్యే రోజా బోరు ప్రారంభోత్సవం పేరుతో హంగామా చేశారు. దీనిపై రచ్చ నడుస్తుండగానే పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ఏకంగా విజయవాడ వచ్చి వెళ్లారు. ఇక ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. విశాఖ జిల్లాలో సాధారణ పరిస్ధితుల్లో లాగానే తిరిగేస్తున్నారు. వీరందరికీ లాక్ డౌన్ నిబంధనలు లేవా అంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

సీఎం జగన్ మాత్రం..
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న తరుణంలో తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా తిరుగుతుంటే సీఎం జగన్ మాత్రం తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు దాటి బయటకు రావడం లేదు. కరోనా నియంత్రణ చర్యలకు సంబంధించి అధికారులతో బిజీబిజీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకూ బయటికి రావద్దంటూ జగన్ వేడుకుంటున్నారు. కానీ సొంత పార్టీ నేతలను మాత్రం ఆయన నియంత్రించలేకపోతున్నారు.

టీడీపీ విమర్శలు మాత్రం కామన్...
కరోనా వైరస్ కారణంగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికే పరిమితం కావడం, వైసీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు జనాల్లో తిరుగుతుండటాన్నీ ప్రతిపక్ష టీడీపీ తప్పుబడుతోంది. వైసీపీ ఏం చేసినా తప్పే అన్న ధోరణి టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. క్యాంపు కార్యాలయానికే పరిమితమైన జగన్ ను మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలుస్తూ ముసలి సీఎంలు అందరూ జనంలో తిరుగుతుంటే యువ సీఎం మాత్రం ఆఫీసులోనే ఉంటున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇవాళ విమర్శించారు. మరోవైపు వైసీపీ ఎంపీ సాయిరెడ్డి విశాఖ పర్యటనలను సైతం టీడీపీకి చెందిన ప్రతీ నేతా తప్పుబడుతున్నారు. ఇలా వైసీపీ నేతలు ఇంట్లో ఉన్నా తప్పే, బయటికొచ్చినా తప్పే అన్న వైఖరి టీడీపీలో కనిపిస్తోంది.

సాధారణ జనం నుంచీ ఫిర్యాదులు..
క్యాంపు కార్యాలయంలో ఉంటూ సీఎం జగన్ కరోనాపై సమీక్షలు నిర్వహిస్తుంటే వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి జనంలో ఇష్టారాజ్యంగా తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వీరు ఎక్కడ తిరిగినా ఫర్వాలేదు కానీ తిరిగొచ్చాక క్వారంటైన్లలో ఎందుకు ఉండరని జనం ప్రశ్నిస్తున్నారు. తాజాగా విజయవాడ వెళ్లొచ్చిన పలాస ఎమ్మెల్యే అప్పలరాజును క్వారంటైన్ కు పంపాలని సొంత నియోజకవర్గంలో అధికారులకే ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్దితి అర్ధం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications