ఆరోజు జగన్ ఏమన్నారు?: ‘30 ఏళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వయసు మనది'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ నిప్పులు చెరిగారు. శనివారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న నాయకులతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను పోలిస్తే సగం మంది రౌడీలే నాయకులయ్యారని ఆరోపించారు.
ఒక మేజిస్ట్రేట్గా ఫైరింగ్ ఆదేశాలు ఇవ్వగలిగిన తహశీల్దార్ను సైతం జుట్టుపట్టి లాగిన నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాజకీయాలను రౌడీలు నేరమయం చేశారని, ఇటువంటి నేతలను ఎన్నుకునే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో అధికారులకే దిక్కు లేకుండాపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ తరహా పాలన సాగుతోందని వైసీపీ కార్యకర్తలు గ్రామ గ్రామాన ఇంటిటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వెనుకబడిన తరగతుల కోసం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 120 హామీలు ఇస్తే అధికారంలోకి వచ్చినా ఒక్కటి అమలు కాలేదని దుయ్యబట్టారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ హామీ మనం కూడా ఇద్దామని ఎన్నికల ముందు వైయస్ జగన్ను తాము అడిగామని, ఆయన నాలుగు రోజులు గడువు అడిగారని అన్నారు.
అనంతరం దానిపై ఆర్థిక నిపుణులతో అధ్యయనం చేయించిన తర్వాత '30 ఏళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వయసు మనది. ప్రజల్ని అమలు కాని హామీలతో మోసం చేయడం సరికాదు' అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. గతేడాది
బ్యాంకర్లు రూ.55 వేల కోట్లను రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.19 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
రుణమాఫీ కారణంగా రైతులను డిఫాల్టర్లుగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడి ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు కుప్పకూలడానికి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీయే కారణమన్నారు. ఉచిత ఇసుక, మట్టి అంటూ అంతా అవినీతిమయం చేశారని ఆరోపించారు.
రాజకీయాల్లో డబ్బే ప్రధానమని, డబ్బుతోనే గెలవొచ్చనే ధోరణిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆయన చెప్పారు. రాబోయే రెండేళ్లు వైసీపీ కార్యకర్తలు పోరాటం చేసి పార్టీని గెలుపించుకోవాలంటే సర్వశక్తులూ ఒడ్డాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలపై సర్వే చేయిస్తే 72 శాతం ప్రజలు వారిని వ్యతిరేకిస్తున్నట్టు తేలిందన్నారు.












Click it and Unblock the Notifications