కేంద్రంపై రేపే వైసీపీ అవిశ్వాసం: మద్దతివ్వాలంటూ టీడీపీ సహా అన్ని పార్టీలకూ లేఖలు
Recommended Video
అమరావతి: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు తదితర అంశాలపై డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ మార్చి 16న, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో వైసీపీ తన వ్యూహాన్ని మార్చింది. ఈ మేరకు సహకరించాలని కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాయాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. కేంద్రంపై అవిశ్వాసాన్ని పెట్టనున్నట్టు ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వైసీపీ తన వ్యూహన్ని అమలు చేయాలని భావిస్తోంది.
పార్లమెంట్ ఉభయ సభల్లో చోటు చేసుకొంటున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగా పెట్టాలనేది వైసీపీ యోచన.
కేంద్రంపై వైసీపీ అవిశ్వాసం
మార్చి 16న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. టిడిపి ఎంపీలు కూడ ఆందోళన సాగిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అవిశ్వాస నిర్ణయాన్ని తీసుకొంది.
టిడిపితో సహ అన్ని పార్టీలకు లేఖలు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టేందుకు టిడిపితో సహ అన్ని పార్టీలకు లేఖలు రాయాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు వైసీపీ నేతలు కేంద్రంపై ప్రవేశ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఆ లేఖలో కోరనున్నారు. టిడిపికి కూడ ఈ లేఖను పంపాలని వైసీపీ నిర్ణయించింది.
అవిశ్వాసానికి ఎవరు సహకరిస్తారో
కేంద్రంపై అవిశ్వాసానికి ఏ పార్టీలు సహకారాన్ని అందిస్తాయనే విషయమై పార్లమెంట్లో తేలనుంది. అయితే ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఈ అవిశ్వాసానికి సహకరిస్తాయా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అవిశ్వాసం తీర్మానంపై ఏ పార్టీల మద్దతును వైసీపీ సంపాదిస్తోందో కొన్ని గంటల్లోనే తేలనుంది.
టిడిపిని ఇరుకున పెట్టే వ్యూహం
టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకుగాను వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిడిపి వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బిజెపితో టిడిపి మధ్య దూరం కూడ పెరుగుతోంది. ఈ తరుణంలో వైసీపీ కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాసం రాజకీయంగా టిడిపిపై ఏ మేరకు ప్రభావం చూపుతోందోనేది అవిశ్వాసానికి మద్దతిచ్చే పార్టీలను బట్టి ఉండే అవకాశం లేకపోలేదు. అయితే కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే అవిశ్వాసానికి వైసీపీ సిద్దం కావడంపై టిడిపి ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్తితులు టిడిపిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి