ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ దిశగా తొలి విజయం సాధించానని, సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ నమోదైందని, ఈనెల 22న విచారణకు రానుందని వెల్లడించిన మరుసటి రోజే మరో అస్త్రాన్ని సంధించారు. హైదరాబాద్ లో దీక్ష చేసిన వైఎస్ షర్మిల పట్ల పోలీసుల తీరును ఖండిస్తూనే, అమరావతిలో మహిళా రైతులపై జగన్ సర్కారు దమనకాండపైనా మాట్లాడరేంటని విజయమ్మను ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. ఏపీ, తెలంగాణ అంశాలను ప్రస్తావించారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

షర్మిలకు రఘురామ సంఘీభావం
''మహానేత వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజల కోసం, నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేసిన సందర్భంలో ఆమె పట్ల జరిగిన ఘటనను నన్ను బాధించాయి. ఉదయం నుంచి ఏమీ తినకుండా నిరసన చేసిన ఆమె.. దీక్షా స్థలి నుంచి ఇంటి వరకు నడిచి వెళతానంటే, పోలీసులు ఏదో ఒక రకంగా నచ్చచెప్పాల్సిందిపోయి, జాకెట్ చినిగిపోయేలా ప్రవర్తించడం దారుణం. మహిళా పోలీసులు షర్మిలను డీల్ చేసిన పద్ధతి ముమ్మాటికీ తప్పే. దీనిపై..

ఆ పోలీసులపై కేసీఆర్ చర్యలు..
నిరుద్యోగుల సమస్యలపై దీక్ష సందర్భంగా వైఎస్ షర్మిల పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసులు అందరిపైనా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేను డిమాండ్ చేస్తున్నా. నాకు బాగా నచ్చిన రాజకీయ నేతల్లో కేసీఆర్ ఒకరు. పోలీసులపై ఆయన చర్యలకు ఆదేశిస్తారనే అనుకుంటున్నా. అదీగాక, షర్మిలపై దాడిని ఖండిస్తూ ఆమె తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చలించినపోయిన తీరు నాతో పాటు చాలా మందిని ఆలోచింపజేసింది. ఆ నిమిషం మా అందరికీ అమరావతి మహిళా రైతులు గుర్తుకొచ్చారు..

అమరావతి మహిళల్ని డొక్కలో తన్ని..
తెలంగాణలో షర్మిల దుస్తులు చిరిగినప్పటికీ, కనీసం ఆమెకు నిరసన తెలిపే అవకాశాన్నైనా కేసీఆర్ సర్కారు కల్పించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మహిళలకు నిరసన తెలిపే అవకాశాన్ని ఇవ్వకపోగా, అత్యంత దారుణంగా దమనకాండకు దిగింది జగన్ సర్కారు. రాజధాని ఉద్యమంలో పాల్గొన్న మహిళలను ఘోరంగా కొట్టి, రోడ్డు మీద పడేసి డొక్కలో, పొట్టలో తన్ని, పశువుల మాదిరిగా వాహనాల్లో వేసుకుని పోయిన ఘటనలు ఉన్నాయి. తెలంగాణలో షర్మిల పాపకు జరిగిన అన్యాయాన్ని గర్హించిన విజయమ్మగారికి అమరావతి మహిళల బాధ పట్టకపోవడం విచారకరం. ఒక వైసీపీ సభ్యుడిగా..

కేసీఆర్కు అలా జగన్కు మరోలా..
నిన్న షర్మిల ఎదుర్కొన్న అనుభవాల, వాటికి విజయమ్మ ఇచ్చిన రియాక్షన్ పై అమరావతిలోని మహిళాలోకం చర్చిస్తున్నది. ఆ గ్రూపుల్లో సభ్యుడిగా చాలా విషయాలు నా దృష్టికి వచ్చాయి. మహిళ జాకెట్ చించారంటూ కేసీఆర్ సర్కారు తీరును గర్హించిన విజయమ్మ.. తనకొడుకు జగన్ అమరావతి మహిళల పట్ల అనుసరిస్తున్న తీరును కూడా ఖండించాలని, కనీసం మహిళా రైతులకు విజయమ్మ సానుభూతైనా వ్యక్తం చేయరెందుకనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అమరావతి దుష్టాంతాలపై విజయమ్మ మాట్లాడితే పార్టీ ఇమేజ్ పెరుగుతుందని వైసీపీ సభ్యుడిగా నా భవన కూడా. ఒక తల్లిగా విజయమ్మ బాధను అర్థం చేసుకోగలం, కానీ అమరావతి మహిళలు కూడా షర్మిల లాంటి ఆడబిడ్డలే అని విజయమ్మ గుర్తించాలని కోరుతున్నా.. ఇకపోతే..

నందిగం సురేశ్పై ఫిర్యాదు
వైసీపీలో సీఎం జగన్ తర్వాత అంతటి నాయకుడిగా కొనసాగుతోన్న బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పై ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ కు ఓ ఫిర్యాదు లేఖను పంపాను. అయితే ఇది.. నన్ను కుక్క అని దూషిచించినందుకు చేసిన ఫిర్యాదు కాదు. మదర్ ఫ్లోరా ఫెయిత్ మినిస్ట్రీ స్వీసెస్ అనే పేరుగల సంస్థతో సురేశ్ కు సంబంధాలున్నాయి. అడ్రస్ లేని సంస్థల నుంచి ఆ మినిస్ట్రీకి డబ్బులు వస్తున్నాయి. అదీగాక తాను దళిత హిందువునని, ఎస్సీ సర్టిఫికేట్ తో రిజర్వుడు స్థానంలో ఎంపీ అయిన సురేశ్, క్రైస్తవాన్ని పాటిస్తూ, ఆ మతాచారంలో పెళ్లిచేసుకున్నారు. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ పొందడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఈ అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని సీఐడీని కోరాను. వారు స్పందించకుంటే కేంద్ర సంస్థలను, కోర్టులను ఆశ్రయిస్తాను. తిరుపతి..

అన్ని పార్టీల్లో అలాంటోళ్లు..
దళిత హిందువునని చెప్పుకుంటూ క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యే నేతలు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపైనా ఈ ఆరోపణలున్నాయి. వీటిపై బీజేపీ నేతలు, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నలు లేవనెత్తడమేకాదు, ఎన్నికల సఘానికి కూడా ఫిర్యాదు చేశారు. గురుమూర్తి ఏనాడూ తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని, చర్చికి మాత్రం నిత్యం వెళుతూనే ఉంటారని తెలిసింది. రాజ్యాంగ విరుద్ధం అని తేలితే సురేశ్ గానీ, గురుమూర్తిగానీ అందరిపైనా చర్యలు తీసుకోవాలి. ఇక..

మా ఇంట్లో ఇద్దరికి కరోనా..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్నది. పారాసిటమాల్ వేసుకుంటేనో, బ్లీచింగ్ పౌడర్ చల్లితేనో సరిపోతుందని సీఎం జగన్ అనుకున్న కరోనా కంటే సెకండ్ వేవ్ చాలా బలంగా ఉంది. మా ఇంట్లోనే ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. నన్ను కూడా ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, కరోనా సాకుతో సీఎం జగన్ ఇవాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఏనాడూ మాస్కు పెట్టుకోని ఆయన.. ప్రజలు మాస్కు పెట్టుకోవాని సూచించారు. ఫోన్ చేసిన గంటల్లోనే ఆస్పత్రిలో బెడ్లు ఇస్తామన్నారు. మరి నిన్నటిదాకా కరోనాకు గురైన పేషెంట్లు ఏయే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారనే వివరాలను కూడా బయటపెట్టాలి. బెడ్లు దొరకట్లేదని చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. కరోనా విషయంలో సహజీవన సిద్ధాంతాలు కాకుండా ఆరచరణాత్మక కార్యాచరణను సీఎం జగన్ చిత్తశుద్ధతో చేపట్టాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications