జగన్కు దూరంగా మరో సొంత ఎంపీ?: వాట్ నెక్స్ట్?
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. న్యూడ్ కాల్స్ ఆరోపణల వ్యవహారం సద్దుమణగట్లేదు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారానికి దారి తీసింది. వైఎస్ఆర్సీపీని ఆత్మరక్షణలో పడేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తోన్న రాజకీయ దాడితో సతమతమౌతోంది. గోరంట్ల మాధవ్ విషయంలో ప్రతిరోజూ విమర్శలను గుప్పిస్తోన్నారు టీడీపీ నాయకులు.
టీడీపీ దాడితో..
గోరంట్ల మాధవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోన్నారు. ఆయనను ఇంకా ఎందుకు కొనసాగిస్తోన్నారంటూ నిలదీస్తోన్నారు. అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోంది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై వీలైనంత త్వరగా నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.
దోషిగా తేలితే..
ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పూర్తిగా డిఫెన్స్లో పడింది. తెలుగుదేశం పార్టీ చేస్తోన్న విమర్శలపై ఎదురుదాడికి దిగట్లేదు. ఈ వివాదంలో గోరంట్ల ప్రమేయం ఉన్నట్లు తెలితే- ఆయనపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తోన్నారు. ఈ వీడియోలను ఫోరెన్సిక్ విభాగం పరిశీలిస్తోంది.
జగన్ సీరియస్..
ఈ ఉదంతంపై అటు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారనేది ఇప్పటికే స్పష్టమైంది. గోరంట్ల వివాదాస్పద న్యూడ్ వీడియో కాల్స్ విషయంలో పార్టీ నాయకులెవరూ స్పందించ వద్దని, టీడీపీ చేస్తోన్న విమర్శలపై ఎదురుదాడికి దిగొద్దని ఆదేశించినట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తు నివేదిక అందేంత వేచి చూడాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. గోరంట్ల ప్రమేయం ఉన్నట్లు తేలితే- ఆయనపై చర్యలు తప్పవనే సంకేతాలను ఇచ్చారు కూడా.
ఢిల్లీ పర్యటనలో..
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలోనూ ఇది స్పష్టమైంది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ను గోరంట్ల కలవలేదు. ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. తోటి లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఆయనను కలిసినప్పటికీ గోరంట్ల మాధవ్ వారితో కనిపించలేదు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా పార్టీ ఎంపీలతో కలిసి కనిపించారు గోరంట్ల మాధవ్. సహచర సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు దూరంగా ఉన్నారు.
దూరం పెట్టినట్టే..
వైఎస్ జగనే ఆయనను దూరం పెట్టారనే ప్రచారం సాగుతోంది. న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంలో గోరంట్ల దోషా? నిర్దోషా అనేది తేలేంత వరకూ ఆయనను పక్కన పెట్టినట్టేనని చెబుతున్నారు. దోషిగా తేలితే పార్టీ పరంగా కఠిన చర్యలు ఉండొచ్చని అంటున్నారు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటుబ్యాంక్ ఉన్న హిందూపురం నుంచి ఆయన ఎన్నిక కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ఉంటాయని అంటున్నారు.