మోడీ హయాంలోనూ బీసీలకు అన్యాయమే- పార్లమెంట్ ముట్టడిస్తాం ! వైసీపీ ఎంపీ హెచ్చరికలు..
ఏపీలో తొలిసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు బీసీలు తొలిసారిగా మద్దతివ్వడం ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుంటారు. బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే బీసీ కుల గణన కోసం వైసీపీ సర్కార్ కేంద్రానికి పలు విజ్ఞప్తులు కూడా చేసింది. ఈ తరుణంలో బీసీలపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ఇవాళ విమర్శలు గుప్పించారు.
బీసీ ప్రధాని ఉన్నా దేశంలో తమకు న్యాయం జరగడంలేదని వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు పలు కీలక డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఛలో ఢిల్లీ చేపడుతున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోతే త్వరలో పార్లమెంట్ భవనాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
దేశంలో పాలకులు బీసీల్ని ఓట్ల యంత్రాలుగానే చూస్తున్నారని వైసీపీ ఎంపీ కృష్ణయ్య మండిపడ్డారు. అగ్రకులాల వారు ఎలాంటి ధర్నాలు, డిమాండ్లు చేయకున్నా 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని కృష్ణయ్య ఆరోపించారు.
బీసీలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాష్ట్రాల్లోని బీసీలను ఏకం చేసి పోరాడుతామని కృష్ణయ్య ప్రకటించారు. బీసీ ప్రజాప్రతినిధులు కూడా రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగస్వామ్యం కావాలని.. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.