ఎమ్మెల్యే జక్కంపూడికి ఎంపీ భరత్ స్ట్రాంగ్ కౌంటర్: చీకటి రాజకీయాలు, టీడీపీ నేతలతో కుమ్మక్కు తెలుసంటూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలలో అధికార వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఆధిపత్య పోరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళింది. బాహాటంగా విమర్శలు చేసుకునే దాకా వచ్చింది. తాజాగా ఎంపీ మార్గాని భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
హోం మంత్రి నియోజకవర్గంలో వైసీపీ విధ్వంసం: టీడీపీ మహిళా నేత ఇంటిపై దాడి, ఆరు బైక్ లు దగ్ధం
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యలపై ఎంపీ భరత్ ఫైర్
రాజమండ్రిలో పార్టీని భరత్ నాశనం చేస్తున్నారని, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో సెల్ఫీలు దిగుతున్నారని, పిచ్చి చేష్టలతో పార్టీకి నష్టం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యలపై ఎంపీ మార్గాని భరత్ ఘాటుగా స్పందించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై స్పందించిన భరత్ మీడియా సాక్షిగా జక్కంపూడి రాజాపై మండిపడ్డారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు అంటూ నిప్పులు చెరిగారు. తనపై అభియోగాలను చేసేముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కొందరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారని, తమ కుటుంబం గురించి ప్రజలందరికీ తెలుసు అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలతో ఎమ్మెల్యే కుమ్మక్కు.. అందుకే తనపై ఆరోపణలన్న భరత్
తమ పార్టీలోని ఒక నాయకుడు టిడిపి నేతలతో కుమ్మకై తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మార్గాని భరత్. తాను పార్టీ కోసం ఎక్కువగా పని చేస్తున్నానని, అలా పని చేయడం వల్ల సదరు నేతకు ఏమైనా బాధ కలుగుతుందేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజమండ్రిలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పిన భరత్, తను నిస్వార్ధం గానే పనులు చేయిస్తున్నానని వెల్లడించారు. తాను పార్టీ లక్ష్మణ రేఖను దాటనని, ఆయన కూడా తన పరిధిలోనే ఉంటే బాగుంటుందని మార్గాని భరత్, జక్కంపూడి రాజాకు హితవు పలికారు.
తాను లక్ష్మీ నారాయణతో సెల్ఫీ తీసుకోలేదన్న భరత్
ఆయనలాగా తాను చిన్నపిల్లాడిలా ప్రవర్తించలేనని మార్గాని భరత్ కౌంటర్ వేశారు. తాను కాపు సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను కలిశానని, వివి లక్ష్మీనారాయణ తనను పార్లమెంట్లో బాగా మాట్లాడుతున్నానని చెప్పారని, తాను వెళ్లి లక్ష్మీనారాయణ తో సెల్ఫీ తీసుకోలేదని స్పష్టంచేశారు మార్గాని భరత్. అంతేకాదు వీడియో దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది అంటూ మార్గాని భరత్ పేర్కొన్నారు. అనవసరపు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
భరత్ తీరుతో పార్టీకి నష్టం అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శలు
నిన్నటికి నిన్న ఎంపీ మార్గాని భరత్ పై విమర్శలు చేసిన రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులలో ఉన్న వారిని దూరంగా పెడితే, భరత్ వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. సీఎం జగన్ ను గతంలో ఇబ్బంది పెట్టిన లక్ష్మీనారాయణతో ఎంపీ మార్గని భరత్ సెల్ఫీలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని, ఆయనతో ఏం పనిఉందో చెప్పాలని ప్రశ్నించిన జక్కంపూడి రాజా, రౌడీషీటర్లు, భూ కబ్జాదారులు ఎంపీ భరత్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఎంపీ భరత్ తనను ఏమీ చేయలేరు అని తేల్చి చెప్పారు.
అధికార వైసీపీలో అంతర్గత చిచ్చు ... గతంలోనూ వార్నింగ్ .. అయినా మళ్ళీ ఇలా
అధికార వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఇలా విమర్శలను చేసుకోవడం తూర్పుగోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతుంది. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా అనేకమార్లు ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఇద్దరినీ కలపటానికి వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నం చేశారు. సీఎం జగన్ వీరి వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారని కలిసి ముందుకు సాగాలని సూచించారు. అయినా మరోమారు తాజాగా ఇద్దరి మధ్య వివాదాలు బహిరంగ చర్చకు కారణం అయ్యాయి.