భయపడం: రోజా, మిథున్ రెడ్డి అరెస్ట్తో టెన్షన్, 9మంది ఎమ్మెల్యేల అరెస్ట్
చిత్తూరు: తమ పైన ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని నగరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా ఆదివారం వాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును రోజా ఖండించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులతో తమ పార్టీ ప్రజాప్రతినిధులను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోను భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.
ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, బెదిరింపులకు లొంగమని చెప్పారు. తమ పైన పెట్టిన కేసులను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు: ఉమ్మారెడ్డి
మిథున్ రెడ్డి అరెస్టును వైసిపి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రజాదరణ పొందిన వైసిపి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి చర్యలు మంచివి కావన్నారు.
చిత్తూరు, కడప జిల్లాల్లో ఉద్రిక్తత: తొమ్మిది మంది వైసిపి ఎమ్మెల్యేల అరెస్ట్
మిథున్ రెడ్డి అరెస్టుతో చిత్తూరు, కడప జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది వైసిపి శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రహదార్లపై రాస్తారోకోలు చేస్తున్నారు. మిథున్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రహదార్లపై విధ్వంసం సృష్టించారు.
రెండు జిల్లాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను చెదరగొడుతూ వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. రాజకీయ ప్రతీకారాల్లో భాగంగా మిథున్ అరెస్ట్ జరిగిందని, సీఎం భయపెట్టాలనుకుంటున్నారని, ఆయన ఉద్దేశం నెరవేరదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
మదనపల్లి, పీలేరుకు చెందిన పలువురు వైసిపి కార్యకర్తలు శ్రీకాళహస్తి బయలుదేరగా, వారిని కలికిరి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైసిపి నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.
తిరుపతి గాజులమాండ్యం సర్కిల్లో ఆందోళనకు దిగిన ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్, నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ రేణిగుంట పోలీసుస్టేషన్కు తరలించారు.