విమానాశ్రయంలో వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వీరంగం: మేనేజర్పై దాడి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు వీరంగం సృష్టించారు. పాస్లు చూపించాలని చెప్పిన ఓ విమానాశ్రయ అధికారి పైన వారు చేయి చేసుకున్నారు.
సమాచారం మేరకు... చేయి చేసుకున్న వారిలో వైసిపి నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు ఉన్నారని తెలుస్తోంది. బోర్డింగ్ పాస్ విషయమై మిథున్ రెడ్డి మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో వాగ్వాదం ముదిరింది. దీంతో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, ఇతర కార్యకర్తలు మేనేజర్ పైన చేయి చేసుకున్నారు.
అనంతరం వారు బలవంతంగా విమానాశ్రయంలోకి ప్రవేశించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వారు చేయి చేసుకుంది ఎయిరిండియా మేనేజర్ పైన.
భారీ వర్షాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్ కోసం వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. స్వయంగా ఓ ఎంపీ... మేనేజర్ పైన దాడి చేయడం గమనార్హం. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఎంతమంది దాడి చేశారనేది తెలియనుంది.