సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం
బహిష్కరణ అంశం ఇంకా తేలకపోవడంతో ఇప్పటికీ వైసీపీ ఎంపీగానే కొనసాగుతూ, సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శల దాడులు చేస్తోన్న రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పూనుకున్నారు. అవినీతి, అక్రమాస్తులకు సంబంధించి 11 కేసుల్లో నిందితుడిగా ఉంటూ, ఏడాదిన్నరగా విచారణ నుంచి తప్పించుకుంటున్న జగన్ బెయిలును రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. తెలుగువారైన జస్టిస్ ఎన్వీ రమణ తదుపరి సీజేఐ కావడం ఖరారు కావడం కొందరికి బాధ కలిగిస్తోందన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ కీలక అంశాలు చెప్పుకొచ్చారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ద్రౌపతీ వస్త్రాపహరణంలా..
''రాజ్యాంగం ఆధారంగా నడిచే న్యాయ వ్యవస్థల పనితీరుపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా, 11చార్జిషీటుల్లో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ తాను ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాననే సాకుతో విచారణను నుంచి తప్పించుకుంటున్నారు. ఒకటీ పది కాదు, ఏకంగా ఏడాదిన్నర కాలంగా ఆయన కోర్టు విచారణకు హాజరుకావడంలేదు. విచిత్రంగా దీనిపై సీబీఐ కూడా మౌనం దాల్చింది. ఏ న్యాయస్థానాలూ ఇదేంటని అడిగే పరిస్థితి లేకుండా పోయింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే.. న్యాయ వ్యవస్థ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, ఆ విషయాన్ని దర్యాప్తు సంస్థలు, కోర్టులు పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండటం అనూహ్య పరిణామమే. భారతంలోని ద్రౌపతీ వస్త్రాపహరణం ఘట్టంలో కౌరవులు ఏం చేసినా ఎవరూ అడ్డు చెప్పలేనట్లుగా, ఇవాళ జగన్ ఏది చేసినా వ్యవస్థలు అడ్డుకునే పరిస్థితి లేదన్నది నా అభిప్రాయం. అదీకాక..

జగన్ బెయిల్ రద్దు చేయండి..
సీఎం జగన్ సీబీఐ కేసులపై ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేస్తుంటాయి. ఇటీవల బీజేపీ నేత సునీల్ దేవధర్ కూడా.. ఏక్షణమైనా బెయిల్ రద్దయి, జగన్ జైలుకు పోతాడని అన్నారు. ఒక బాధ్యతగల సీఎంగా, పార్టీ అధినేతగా ఇన్ని మాటలు పడటం జగన్ కు అవసరమా? ఆ కేసుల విచారణేదో ఎదుర్కుంటే అయిపోతుంది కదా, కోర్టుకు వెళ్లి ట్రయట్స్ పూర్తయిన తర్వాత మచ్చలేని చంద్రుడిగా బయటికి రావొచ్చుకదా అన్నది నా ఉద్దేశం. కేసుల విచారణలో జాప్యాన్ని నివారించి, త్వరగా కేసుల నుంచి బటయపడాలని, జగన్ నిర్దోషిగా నిరూపితుడవుతాడనే నమ్ముకంతోనే నేను కోర్టును ఆశ్రయించాను. సీఎం జగన్ బెయిల్ రద్దు చేసి, ఆయన విచారణకు హాజరయ్యేలా ఆదేశించాలంటూ సీబీఐ కోర్టులో నేనొక పిటిషన్ వేశాను. దీనికి..

సహ నిందితులకు పదవులు..
ముఖ్యమంత్రి అయినందున బిజీగా ఉంటున్నందుకే విచారణ నుంచి జగన్ మినహాయింపులు పొందుతున్నారు. అయితే ఆయన తీరు న్యాయవస్థకు, దర్యాప్తు సంస్థలకు సవాలు లాంటిదని చెప్పకతప్పదు. అదీగాక, తనతోపాటు సహ నిందితులుగా ఉన్న వ్యక్తులకు జగన్ కీలక పదవులు ఇచ్చాడు. ఒకర్ని ఎంపీగా, ఇంకొక అధికారిణికి ముఖ్య పదవి, మరో సహనిందితుడి సోదరులకు డిప్యూటీ సీఎం పదవులు.. ఇలా చాలా చేశారు. తద్వారా జగన్ తన పదవిని అడ్డం పెట్టుకుని కేసులను ఎంతగా ప్రభావితం చేస్తున్నారో నిరూపితం అవుతోంది. అందుకే బెయిల్ రద్దు చేసి, త్వరగా విచారణ పూర్తయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించాను. దీనిపై..

వైఎస్ భారతికి సీఎం పదవి ఇచ్చేసి..
దివంగత జయలలిత అంటే జగన్ కు చాలా ఇష్టం. ఆమె కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన సందర్బంలో ఒక స్టాండ్ బైని సీఎంగా పెట్టుకునేవారు. జగన్ విషయంలోనూ సీబీఐ బెయిల్ రద్దయి,కోర్టులో విచారణ పూర్తయ్యేదాకి సీఎం పదవిని వైఎస్ భారతికో, షర్మిల లేదంటే విజయమ్మలకు ఇచ్చుకునే వీలుంటుంది. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్, తాజాగా మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తదితరులు విచారణ నిష్పక్షపాతంగా సాగేలా తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్ కూడా అదే పని చేసి తన సఛ్చీలతను నిరూపించుకోవాలి. ఏపీ సీఎం బెయిల్ రద్దు కోరుతూ నేను వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను. మరో ముఖ్యమైన విషయం..

జస్టిస్ రమణ రాకతో వారికి బాధ..
సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)ను తదుపరి సీజేఐగా నియమిస్తూ మంగళవారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఏప్రిల్ 24న రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాలులో జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణం చేస్తారని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. రమణకు అత్యున్నత పదవి దక్కడం తెలుగువారంతా సంతోషించాల్సిన విషయం. కానీ ప్రజాస్వామ్యమంటే నమ్మకం లేనోళ్లు, రాజ్యాంగాన్ని అసహ్యించుకునే వాళ్లు ఆయన రాకతో బాధపడుతున్నట్లున్నారు. అలాంటి వాళ్లను చూసి జాలి పడటం తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు. జస్టిస్ రమణకు రాష్ట్రప్రజలందరి తరఫున శుభాభినందనలు చెబుతున్నాను'' అని ఎంపీ రఘురామ అన్నారు.












Click it and Unblock the Notifications