జగన్ సర్కార్ మరో భూదందా -ఇళ్ల పట్టాల అసలు కథ -నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్: వైసీపీ ఎంపీ రఘురామ
అనర్హత వేటు అంశం ఎటూ తేలకపోవడంతో సోంత పార్టీపై, అధినేత సీఎం జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. 'రాజధాని రచ్చబండ' పేరుతో ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న ఆయన అదే పనిగా జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఏపీ సర్కారు తలపెట్టిన 'సరసమైన ధరలకే ప్రజలకు ఇళ్ల పట్టాలు' పథకంపైనా రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశువైద్యశాలలకు అంబులెన్సులు, నిమ్మగడ్డ పదవీ విరమణ అంశాలపైనా ఎంపీ మాట్లాడారు.
జగన్ మరో భూదందా..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరే సరికొత్త పథకాన్ని సీఎం జగన్ గతవారం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది తమ ఉద్దేశమని, ఇందుకోసం ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలు సేకరిస్తామని, న్యాయ పరంగా చిక్కుల్లేని విధంగా క్లీన్ టైటిల్తో ఇళ్ల స్థలాలు ఇస్తామని, లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం సరసమైన ధరలకు ప్లాట్లను అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. అయితే ఈ పథకం ద్వారా జగన్ సర్కారు మరో భూదందాకు తెరలేపిందని వైసీపీ ఎంపీ రఘురామ ఆరోపించారు.
లేఅవుట్ల అభివృద్ధికి అర్థం అదేగా..
అన్ని జిల్లాల్లో మధ్యతరగతి వర్గాలకు సరసమైన ధరలకు ఇళ్ల పట్టాల పేరుతో మరో పథకానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతోందన్న రఘురామ.. మరో భూ దందా కోసమే దీన్ని చేపడుతున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసి ఇస్తామనడంలో దందా కోణం ఉందన్నారు. సంపద సృష్టించాల్సిన ప్రభుత్వం.. అప్పులు చేసి రాష్ట్రాన్ని నట్టేట ముంచుతోందని, కొత్త కొత్త స్కీమ్లు ఏవీ ప్రజలకు మేలు చేసేవి కావని, వాటి వల్ల లబ్దిపొందేది ఎవరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదన్నారు.
బైక్తో పోయేదానికి అంబులెన్సా?
తక్కువ ధరకు ఇళ్ల పట్టాల్లాగే పశువులకూ అంబులెన్స్ వైద్య సేవలు అందించేలా జగన్ సర్కారు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. 108 అంబులెన్సుల తరహాలో పశువుల కోసం మొబైల్ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్ పేరుతో ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొబైల్ అంబులెన్సులు (వెటర్నరీ) క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అంబులెన్స్కు ఒక పశువైద్య వైద్యుడు, ఒక పారా-వెటర్నరీ కార్మికుడు ఉంటారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటిది చేపట్టడం ఏపీలో ప్రధమం. అయితే, ఇది కూడా అనవసర ఖర్చుతో కూడిన పని అని ఎంపీ రఘురామ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బైకులు ఇస్తామంటోన్న ప్రభుత్వం.. వెటర్నరీ సిబ్బందికి కూడా టూవీలర్లు కొనిస్తే, వాళ్లే నేరుగా గ్రామాలకు వెళ్లి పశువులకు చికిత్స చేసే వీలుంటుందన్నారు.
కేంద్రం నిధులు స్వాహా..
బడ్జెట్ పరిమితులకు మించి జగన్ సర్కారు ఏపీ రాష్ట్రం పేరుతో భారీ ఎత్తున అప్పులు చేస్తున్నదని, పింఛన్లు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితిలో అనవసర ఖర్చుతో కూడిన కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. ఏపీలో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దోగొప్పో వస్తోన్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకుంటున్నదని రఘురామ ఆక్షేపించారు. బడ్జెట్ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకాలు చేయడం దురదృష్టకరమని, ఏపీలో కరోనా వాక్సిన్ వేసుకోవాలన్నా..డబ్బులు అడుగుతారని ప్రజలు అనుకుంటున్నారని ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. కాగా,
నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం పదవీవిరమణ చేశారు. గడిచిన ఏడాదిన్నరగా జగన్ సర్కారుతో దాదాపు యుద్ధం చేసిన ఆయన కోర్టు ఉత్తర్వులతో పదవిలో కొనసాగి, ఎన్నికలను సైతం నిర్వహించారు. కీలకమైన పరిషత్ ఎన్నికలపై గతంలో కేంద్రానికి తానే ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని నిర్వహించకుండానే నిమ్మగడ్డ పదవి నుంచి వైదొలగారు. ప్రభుత్వపరంగా సత్కారాలేవీ లేకుండా, కనీసం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా దక్కకుండా నిమ్మగడ్డ రిటైరయ్యారు. ఆయనపై జగన్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. జగన్ సర్కారు ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా, మొక్కవోని ధైర్యంతో నిమ్మగడ్డ ముందకువెళ్లారని, ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదని, నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలు చెబుతున్నానని ఎంపీ రఘురామ అన్నారు.
ఈసీ సంచలనం: నందిగ్రామ్లో 144 సెక్షన్ -హెలికాప్టర్లతో నిఘా -స్థానికేతరులకు నో ఎంట్రీ -దీదీvsఅధికారి