రఘురామ ఉదంతంలో అనూహ్య మలుపు -అమిత్ షాతో ఎంపీ కూతురు, కొడుకు భేటీ -జగన్పై కేంద్రానికి ఫిర్యాదు
రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. రెబల్ ఎంపీపై ఏపీ సీఎం జగన్ చర్యలకు కేంద్రం పెద్దల అనుమతి ఉందనే వాదన వినిపిస్తోండగా, ఢిల్లీలో మాత్రం పరిణామాలు మరోలా కనిపించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ రఘురామను ఏపీ నుంచి తెలంగాణకు తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు జరిగాయి..

అమిత్ షాతో రఘురామ ఫ్యామిలీ
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వారు అమిత్షాకు ఫిర్యాదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్షాకు ఇందు ప్రియదర్శిని, భరత్ వివరించారు. అనంతరం ఇరువురు కలిసి షాకు వినతిపత్రం అందజేశారు. రఘురామకు ఏపీలో ప్రాణహాని ఉందని ఆయన భార్య రమాదేవి సైతం అనుమానాలు వ్యక్తం చేస్తుండం తెలిసిందే. కాగా,

కేంద్రం అనుమతితోనే రెబల్ అరెస్ట్?
వైసీపీలో రెబల్ ఎంపీగా సీఎం జగన్ పాలిట కొరకరాని కొయ్యగా మారిన రఘురామపై ఏపీ సీఐడీ సుమోటోగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం, కస్టడీలో పోలీసులు కొట్టారని ఎంపీ ఆరోపించడంతో వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీంకోర్టు ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలనడం తెలిసిందే. కాగా, ఎంపీ రఘురామ అరెస్ట్ వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించడం, కేంద్రం సహకారం లేకుండా ఎంపీ అరెస్టుకు అవకాశమే లేదని ఆయన పేర్కొన్న దరిమిలా ఇప్పుడు రఘురామ ఎపిసోడ్ లోకి అమిత్ షా రాక కీలకంగా మారింది.

జగన్ సర్కారు కౌంటర్ దాఖలు..
ఎంపీ రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని హైకోర్టు అడ్వకేట్ ఉమేష్చంద్ర తెలిపారు. గురువారం ప్రభుత్వ కౌంటర్పై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్ తరుపు కూడా కౌంటర్ వేయొచ్చన్నారు. రెండు కౌంటర్లు, చికిత్సకు సంబంధించిన సీల్డ్కవర్లు పరిశీలించి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని ఉమేష్చంద్ర పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రఘురామ చికిత్స కొనసాగుతోందని, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే పారదర్శకత ఉండదని భావించిన సుప్రింకోర్టు.. అందుకే ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యులు ప్రతి విషయాన్ని రికార్డెడ్గానే చేస్తారని ఉమేష్చంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications