వైసీపీలో మళ్లీ కృష్ణంరాజు కలకలం.. ప్రధానికి ఆ విషయం చెప్పానన్న ఎంపీ
ఏపీలో ఒకవైపు టీడీపీని దెబ్బతీస్తూ మరోవైపు వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బలపడాలనుకుంటోన్న బీజేపీ ఆపరేషన్ కమల్ లో భాగంగా కొంత మంది వైసీపీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేరుగా బీజేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం జరగడం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. గత నెలలో బీజేపీ నేతలతో కలిసి హైదరాబాద్ లో ఓ విందులోనూ పాల్గొన్న ఆ ఎంపీ మరోసారి ప్రధాని మోదీని ప్రశంసనలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది.

మోదీకి విషెస్ చెప్పా..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్ సభలో ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టిన ఆయన.. అసలా చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది, హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు మధ్య ఉండే వ్యత్యాసమేంటో స్పష్టంగా వివరించారు. సీఏఏపై అద్భుతంగా మాట్లాడిన మోదీకి విషెస్ చెప్పినట్లు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

బాగుంది కానీ..
సీఏఏపై ప్రధాని మోదీ ప్రసంగం దేశ ప్రజలను ఆకట్టుకునేలా ఉందన్న వైసీపీ ఎంపీ.. ఇదే విషయాన్ని ప్రధానితోనూ చెప్పానన్నారు. అయితే మోదీ ప్రస్తావించిన విషయాల్లో ‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా' అంశం లేకపోవడం బాధాకరమని, బడ్జెట్ లోనూ ఏపీకి రావాల్సిన వాటాగానీ, అదనపు నిధులుగానీ దక్కకపోవడం విచారకరమని అన్నారు.

ఏం జరుగుతోంది?
ఢిల్లీలో ఉన్నప్పుడే కాకుండా.. మిగతా సందర్భాల్లోనూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీ నేతలకు దగ్గరగా ఉంటుండటంపై వైసీపీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రెబల్ స్టార్ కృష్ణంరాజు లాంటి బీజేపీ నేతలతో బంధుత్వాన్ని కూడా ఏనాడూ దాచుకోని నర్సాపురం ఎంపీ.. ఢిల్లీలో సహచర సభ్యులకు భారీ స్థాయిలో విందులు ఇవ్వడం, ప్రధానిని పదే పదే పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో గుసగుసల సౌండ్ ఇంకొచెం పెరిగింది.












Click it and Unblock the Notifications