ఐపీఎస్ ప్రవీణ్ను ‘ఎవడు’ అంటే తప్పేంటి? -ఎంపీల ముందు అధికారుల స్థాయి చాలా చిన్నది: రఘురామ
సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రోజుకో రీతిగా విమర్శలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు తెలంగాణ వ్యవహారాల్లోనూ కలకలం రేపుతున్నారు. తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన రఘురామ, ఇటు పార్లమెంటులోనూ ప్రవీణ్ అంశాన్ని లేవనెత్తారు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీల ముందు అధికారుల స్థాయి చాలా చాలా చిన్నదని రఘురామ అన్నారు. 'రాజధాని రచ్చబండ' పేరుతో మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

స్వెరోస్ సంఘవిద్రోహం..
''ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గడిచిన 10ఏళ్లుగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఒక అధికారి అదే పోస్టులో ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం, ఆ పదవిలో ఉంటూ స్వెరో అనే పేరుతో ప్రైవేటు సంస్థను నడిపించడం ముమ్మాటికీ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమే. పైగా నిత్యం హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, సమాజానికి విద్రోహం తలపెట్టేలా స్వెరో కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ అంశాలనే నేను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశాను. పార్లమెంటులో ''అత్యవసర ప్రజా ప్రాముఖ్యత'' అంశంపై మాట్లాడినప్పుడూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంశాన్ని లేవనెత్తాను. టీవీ చానెళ్ల డిబేట్లలోనూ నా అభిప్రాయాలు చెబితే స్వెరోల పేరుతో నన్ను బెదిరిస్తున్నారు. అసలు..

ప్రవీణ్ ఎవరో నాకు తెలీదు..
నిజానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరో కూడా నాకు తెలీదు. వ్యక్తిగత పరిచయం అంతకన్నా లేదు. జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ పైనే దాడికి దిగారంటే ఈ స్వెరోస్ నెట్ వర్క్ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ప్రవీణ్ కుమార్ స్పీచ్ లు కొన్ని చూశాను. దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యాధికుడైన ఆయన, తన కులానికి, స్కూళ్లకు మంచి చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రైవేటు మూకలను ప్రోత్సహించడం, క్లాసు రూముల్లోకి తుపాకితో వెళ్లి టీచర్లను భయపెట్టడంపైనే నా అభ్యంతరం. స్వెరోయిజంలో ఎక్కడా జనగనమన, వందేమాతం ఉండవని కూడా తెలిసింది. అలాంటి వ్యక్తిని..

ఎవడు అంటే తప్పేముంది?
ఓ టీవీ చానల్ చర్చలో 'ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవడు?' అని నేను మాట్లాడినందుకు చాలా మంది బెదిరింపులకు దిగుతున్నారు. మనకు తెలియని వ్యక్తిని ఎవడు? అనడం తప్పేంటి? ఇది రాముడు, కృష్ణుడులో డు తప్ప అవమానించినట్లు కాదు. రాష్ట్రపతికి ఫిర్యాదు, పార్లమెంటులో ప్రసంగం తర్వాత స్వెరోల నుంచి నాకు వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఫోన్లు చేసినవాళ్ల వివరాలు సేకరించి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. ఈ బెదిరింపులపై కూడా పార్లమెంటులో పోరాడుతాను. ఫోన్ చేసిన చాలా మంది.. 'ప్రవీణ్ సార్ ను అనేంత స్థాయి నీకుందా?'అని అడుగుతున్నారు. దానికి నా సమాధానం..

ఎంపీ కంటే అధికారులు తక్కువే..
ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎంపీ ముందు అధికారుల స్థాయి చాలా చాలా చాలా చిన్నది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఎంపీల కంటే తక్కువే. కాబట్టి స్వెరోలకు భయపడే ప్రసక్తేలేదు. ఆ అధికారిపై కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు కూడా ఫిర్యాదు చేస్తాను. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోన్న ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాల్సిందే. అంబేద్కర్ ఏనాడూ విదేశీ మతాలను ప్రోత్సహించలేదు. అలాంటిది ఈ స్వెరోలు అంబేద్కర్ బొమ్మతో క్రైస్తవ మత వ్యాప్తి చేస్తున్నారు. ఈ ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రవీణ్ కుమార్ పైనే ఉంది. అతేతప్ప అనవసరంగా హిందువుల జోలికి రావొద్దు. ఆయనంటే..

ఆర్ఎస్ ప్రవీణ్ డిప్యూటీ సీఎం అయినా..
రాజ్యాంగ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతోన్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బహుశా తెలంగాణ ముఖ్యమంత్రికి బాగా ఇష్టం ఉండొచ్చు. కావాలనుకుంటే కేసీఆర్ తన డిప్యూటీ సీఎంగా ప్రవీణ్ ను పెట్టుకోవచ్చు. లేదా స్వెరోల నాయకుడే రాజకీయాల్లోకి రావొచ్చు. అంతేగానీ, స్వెరోల పేరుతో స్వైరవిహారం చేయడమేంటి? సెక్యులరిజాన్ని పాడుచేయడమేంటి? దళితులుగా ఉండి చర్చిలకు పోయే మోసగాళ్లు మా వైసీపీలో కూడా ఉన్నారు. దళితులు మతం మారిన వెంటనే రిజర్వేషన్లు వర్తించబోవని రాజ్యాంగమే చెబుతుంది. స్వెరోనో మరో పేరుతోనో దళితుల ముసుగులో ఉన్న క్రైస్తవులను తిప్పికొట్టాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. కాగా,

చంద్రబాబుపై సుప్రీంకోర్టుకు జగన్..
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన వివిధ కేసుల్లో అరెస్టు నుంచి ఆయనకు కల్పించిన రక్షణను హైకోర్టు మరో 4 వారాలు పొడిగించింది. సదరు కేసులన్నీ పసలేనివి కాబట్టే కోర్టుల్లో ఇలాంటి తీర్పులు వస్తున్నాయనని ఎంపీ అన్నారు. తన కేసులో కాకున్నా, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఐడీ విచారణ కేసులో మాత్రం జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటోందని, అక్కడా వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవన్నారు. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానంతో అధికార పార్టీకి వేల కోట్లు వచ్చిపడతాయని, పూర్తిగా నష్టాల్లో ఉండి, మూసివేతకు సిద్దమైన కంపెనీకి ఇసుక రీచ్ లను కట్టబెట్టడం, తక్కును నిర్వహించే కేంద్ర సంస్థను తీసుకురావడం వెనుక పెద్ద మతలబు ఉండొచ్చని, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంలో సదరు కంపెనీలకు సంబంధం ఉండొచ్చని ఎంపీ రఘురామ అన్నారు.












Click it and Unblock the Notifications