వ్యూహాల్లో తలమునకలైన ఇద్దరు?: రాజీనామా అస్త్రంతో జగన్ సంచలనం, టీడీపీకి ఇరకాటమే!
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశానికి విపక్షాల మద్దతు లభిస్తుండటం.. అవిశ్వాసంపై అన్ని పార్టీలు ఒక్క తాటి పైకి వస్తుండటంతో.. బీజేపీ ఇక దాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అవిశ్వాసానికి కావాల్సిన 50మంది సభ్యుల కనీస మద్దతు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. స్పీకర్ ఇక దీన్ని తోసిపుచ్చే అవకాశం తక్కువే. ఈ నేపథ్యంలో అవిశ్వాసం చర్చకు వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీకి చెందిన ప్రధాన పార్టీలు రెండు గట్టిగానే కసరత్తు చేశాయి.

చంద్రబాబు నిర్దేశం..:
లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు ఉండటంతో.. ఈ అంశంపై పార్లమెంటులో టీడీపీ తరఫున ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మాట్లాడాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ఇద్దరిలో ఒకరు ఆంగ్లంలో, మరొకరు హిందీలో ప్రసంగించాలని స్పష్టమైన సూచన చేశారు.

బీజేపీని కౌంటర్ చేయండి..:
విపక్షాల అవిశ్వాస తీర్మానానికి ప్రతిగా బీజేపీ విశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. చర్చ దేనిపై జరిగినా సరే ఎంపీలంతా సిద్దంగా ఉండాలని చెప్పారు.
ఏపీకి ఇచ్చిన నిధులకు సంబంధించి అమిత్ షా రాసిన లేఖలోని అవాస్తవాలను, తప్పులను మరో లేఖతో కౌంటర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఓ లేఖను సిద్దం చేయించి టీడీపీ ఎంపీలకు పంపించే యోచనలో ఉన్నారు. ఆ లేఖ ఆధారంగా టీడీపీ ఎంపీలు బీజేపీని లోక్ సభలో కౌంటర్ చేసే అవకాశం ఉంది.

వైసీపీ వ్యూహమిలా:
ప్రత్యేక హోదా విషయంలో ముందు నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్న వైసీపీ.. అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అంతే స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా లోక్సభను వాయిదా వేస్తే గనుక.. వాయిదా వేసిన రోజునే తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.

రేపే రాజీనామా అస్త్రం..:
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తమ పార్టీ ఎంపీలు వచ్చే నెల 6వ తేదీన రాజీనామా చేస్తారని జగన్ స్పష్టం చేశారు. అయితే అవిశ్వాసంపై చర్చ పెట్టకపోతే అంతకన్నా ముందే రాజీనామాలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేస్తే, రేపే ఎంపీలంతా రాజీనామాలు సమర్పిస్తారని తేల్చి చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తమ ఎంపీల రాజీనామా పత్రాలు ఉంటాయని కూడా తెలిపారు.

టీడీపీకి సవాల్..:
రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అవిశ్వాసం గనుక చర్చకు రాకపోయి.. వైసీపీ ఎంపీలు రాజీనామాలకు వెళ్తే.. ఆ పార్టీకి ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్ పెరగడం ఖాయమంటున్నారు.
అదే జరిగితే టీడీపీకి మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. హోదాపై ఫైట్ విషయంలో ఇప్పటికే ఆలస్యంగా మేల్కొన్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీకి వైసీపీ దూకుడు మరిన్ని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications