రాజ్యసభలో 3 ప్రైవేటు బిల్లులు పెట్టిన సాయిరెడ్డి-దేశమంతా అమ్మఒడి, నిరుద్యోగభృతి కావాలంటూ
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ పార్లమెంటులో మూడు ప్రైవేటు మెంబర్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఆయన ఈ మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మఒడి పథకం, నిరుద్యోగ భృతితో పాటు ప్రార్ధనా స్ధలాలపై దాడులకు పాల్పడే వారికి శిక్షల పెంపు కూడా ఉంది. వీటిపై సభలో చర్చ జరగాల్సి ఉంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (సవరణ) 2020 పేరిట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో నమోదయ్యే విద్యార్ధుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా విద్యార్ధి తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ఈ బిల్లు ఉద్దేశంగా బిల్లును ప్రవేశపెడుతూ ఆయన వెల్లడించారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.
అలాగే దేశవ్యాప్తంగా నిరుద్యోగ భృతి నిరుద్యోగుల హక్కు కావాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. దేశంలోని 21 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ (సవరణ) బిల్లును విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తద్వారా నిరుద్యోగులకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన తెలిపారు. మరోవైపు ప్రార్ధనా మందిరాలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన జైలు శిక్ష విధించాలని కోరుతూ మరో బిల్లును కూడా సాయిరెడ్డి ప్రవేశపెట్టారు.
ప్రార్ధనా మందిరాలు, స్థలాలపై దాడులు చేసి వాటిని అపవిత్రం చేసే నిందితులకు విధించే జైలు గరిష్ట శిక్షను రెండేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళకు పెంచేలా చట్ట సవరణ చేపట్టేందుకు వీలుగా విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఇండియన్ పీనల్ కోడ్ (సవరణ) 2021 బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులో టీడీపీని ఆయన టెంపుల్ డిస్ట్రక్షన్ పార్టీ (ఆలయాలు పడగొట్టే పార్టీ) అని పేర్కొన్నారు. ఈ బిల్లుతో టెంపుల్ డిస్ట్రక్షన్ పార్టీ (టీడీపీ) అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చని సాయిరెడ్డి అన్నారు.