జగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజం
కరోనా దెబ్బకు ఆదాయం పడిపోయిన తర్వాత కూడా భారీ ఎత్తున సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నది జగన్ సర్కారు. అయితే, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రం తీసుకునే రుణాలపై కేంద్రం ఇటీవలే పరిమితి విధించింది. ఇది జగన్ సర్కారుకు షాక్ లాంటిదని అభివర్ణిస్తోన్న ప్రతిపక్షం, ముఖ్యమంత్రిపై అదే పనిగా విమర్శలు చేస్తున్నది. తెలంగాణతో జల వివాదం అంశంలోనూ జగన్ నాటకాలాడతున్నారని టీడీపీ తిట్టిపోస్తున్నది. ఈ విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో కౌంటరిచ్చారు.
ప్రతి రూపాయికీ పక్కా లెక్క
ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం చేసిన వ్యాఖ్యలను, రుణాలపై పరిమితి విధించడం జగన్ పాలనలో అతి పెద్ద వైఫల్యమని ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సోమవారం ట్విట్లర్ లో స్పందించారు. ప్రభుత్వ లెక్కలంటే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీలో చూపినట్లు బ్లాక్ అండ్ వైట్ బిల్లులు ఉండవని మండిపడ్డారు. ''ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధికారుల ఆమోదం, అకౌంటబిలిటీ ఉంటాయి. బిల్లులు లేకుండా ద్రవ్య వినియోగానికి అనుమతులుండవు. వివిధ దశల్లో ఆడిటింగ్ ఉంటుంది. హెరిటేజ్ బిల్లు కౌంటర్ కాదు. లెక్కలు దాచిపెట్టడానికి. బ్లాక్, వైట్ వేర్వేరుగా చూపడానికి..''అని సాయిరెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్ ద్రోహి, ఆయన వారసులనూ నమ్మొద్దు -ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు :షర్మిలపై హరీశ్ రావు ఫైర్
అప్పటి ప్రధానికి భయపడిందెవరు?
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య వివాదం ఇటీవల తారా స్టాయికి చేరడం, జగన్ చేతగానితనం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని విపక్షాలు విమర్శిస్తుండటం తెలిసిందే. దీనిపై.. ''ఒక్క సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే. నీటి కేటాయింపులు లేకుండా కర్నాటక ఆల్మట్టి డ్యాం నిర్మిస్తుంటే అప్పటి ప్రధాని దేవెగౌడకు ఆగ్రహం కలుగుతుందని నోరు మూసుకున్నది ఎవరు? 14 ఏళ్లు సీఎంగా ఉండి బాబు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒకటైనా ఉందా?'' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అలాగే,
మీడియా నడిపించే ఏకైక పార్టీ
విశాఖ ఏజెన్సీలో గనుల లీజు వ్యవహారాలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేస్తోన్న ఆరోపణలకు కూడా ఎంపీ సాయిరెడ్డి కౌంటరిచ్చారు. అంతేకాదు, టీడీపీ ఉనికిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''దొంగే..దొంగా దొంగా అని అరిచినట్లుంది అయ్యన్న యవ్వారం! చంద్రబాబు సీఎంగా ఉండగా నాతవరంలోని లేటరైట్ గనులను నాకేసిన ఘనుడు. చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు. గిరిజనుల పేరుతో లీజు పొంది ఏజెన్సీని కొల్లగొట్టిన గ'లీజ్ 'గాళ్లు. అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట పడటంతో ధర్నా డ్రామాలు. అసలు, మీడియా నడిపించే దరిద్రపు పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీనే. ఎల్లో మీడియా కట్టు కథలను వండి వడ్డిస్తుంది. పొద్దునే పచ్చ నేతలు భగ్గుమంటారు. ఉద్యమాలు, ధర్నాలు అని రెచ్చిపోతారు. అనుకుల మీడియా సపోర్టుతో నిత్యం వార్తల్లో ఉంటారేమో గానీ, ప్రజల మనసుల్లో స్థానం ఎలా దొరుకుతుంది?'' అని మండిపడ్డారు విజయసాయిరెడ్డి.