టీడీపీ మేనిఫెస్టో రద్దుపై వైసీపీ సెటైర్లు: మొదటి రోజే స్ప్రాప్: ప్రింటింగ్ ఖర్చు వృధాగా
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ గ్రాండ్గా విడుదల చేసిన మేనిఫెస్టో.. మొత్తానికి స్క్రాప్గా మారింది. పంచాయతీ మేనిఫెస్టోను విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. టీడీపీకి షాకిచ్చారు. ఇప్పటిదాకా ముద్రించిన మేనిఫెస్టో కాపీలన్నింటిని వెనక్కి తీసుకోవాలని, వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. ఈ ఉదంతం పట్ల టీడీపీపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి సెటైర్లు పడుతున్నాయి.
పల్లె పగ్రతీ-పంచ సూత్రాలు పేరుతో తెలుగుదేశం పార్టీ కిందటి నెల 28వ తేదీన ఈ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని విడుదల చేశారు. దానికంటే ముందు సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పంచాయతీల్లో తాము సరికొత్త మార్పునకు నాంది పలుతున్నామంటూ ఆయన ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై తొలి గంట నుంచే విమర్శలు వ్యక్తం అయ్యాయి. రాజ్యాంగ విరుద్ధమంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని.. మేనిఫెస్టోను రద్దు చేశారు.
పార్టీ రహితంగా గ్రామ స్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేయడం రాజ్యంగానికి విరుద్ధమని తెలిసినా.. చంద్రబాబు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికే ఆ చర్యకు పూనుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ పంచాయతీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి విమర్శించారు. . ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిమ్మగడ్డ సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారని ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్పై ఛార్జ్షీట్: ఏడేళ్ల కిందటి కేసులో ఏ1గా: నాంపల్లి కోర్టు సమన్లు
40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు.. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టోను విడుదల చేయకూడదనే విషయం తెలియదా? అంటూ నిలదీశారు. తన అనుకూల మీడియాను ఆకర్షించడానికి, మేనిఫెస్టోను విడుదల చేయడం ద్వారా ఓటర్లను ప్రలోభానికి గురి చేయడానికే చంద్రబాబు రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రోజంతా టీవీల్లో కనిపించడానికి మేనిఫెస్టో విడుదల ఆ తతంగాన్ని పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి ట్రిక్కులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారని విమర్శించారు.