అవుట్ డేటెడ్ బుర్రను వాడుతూ చంద్రబాబును మించిపోయిన నారా లోకేష్: సాయిరెడ్డి సెటైర్లు
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలను ఆరంభించినప్పటి నుంచీ అమరావతి ప్రాంత రైతుల వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే వస్తున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఈ ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. జనసేన, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే విషయంపై రాజకీయ వేడి చల్లారట్లేదు. తరచూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం ఏర్పడుతోంది.

నారా లోకేష్కు సాయిరెడ్డి కౌంటర్..
తాజాగా మరోసారి అలాంటి మాటల తూటాలు పేలాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నారా లోకేష్పై కౌంటర్ అటాక్కు దిగారు. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో రైతులు లేరని, వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు మరణించారంటూ నారా లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇద్దరి మృతిపట్ల..
రాజధాని కోసం వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నాయని, ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోయారంటూ నారా లోకేష్ చెప్పారు. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన లంకా శివరామ కృష్ణ, ఉద్దండరాయుని పాలేనికి చెందిన పులి చిన్న లాజర్ మరణించారని చెప్పారు. వైసీపీ నేతల అవమానాలను భరించలేక వారు మృతి చెందారని నారా లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే మూర్ఖపు ఆలోచనను ఇప్పటికైనా మానుకోవాలని, అమరావతిని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సహజ మరణాలను కూడా..
లంకా శివరామకృష్ణ, పులి చిన్నలాజర్ సహజ మరణాన్ని నారా లోకేష్ రాజకీయంగా వాడుకుంటున్నారని విజయసాయి రెడ్డి తాజాగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. తన తండ్రి చంద్రబాబు నుంచి నారా లోకేష్ అవినీతి, అసమర్ధత, అసత్యాలను ప్రచారం చేయడాన్ని వారసత్వంగా తీసుకున్నారని విమర్శించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆయన నారా లోకేష్నే మించిపోయారని ధ్వజమెత్తారు.
Recommended Video

అవుట్ డేటెడ్ బుర్ర ఇంకెన్నాళ్లు?
వయో భారంతో సంభవించే సహజ మరణాలను కూడా నారా లోకేష్ తన రియల్ ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగారని మండిపడ్డారు. తండ్రిలానే నారా లోకేష్ మతి చెడిపోయిందని సెటైర్లను సంధించారు. నారా లోకేష్ ఇంకెంత కాలం అవుట్ డేటెడ్ బుర్రను వాడతారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో సంభవించే సహజ మరణాలను కూడా తన రాజకీయ లబ్ది కోసం వాడుకునేంతటి హీన స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిందని సాయిరెడ్డి విమర్శించారు. అమరావతిలో రైతుల నిరసనలు మూడు గ్రామాలకు మాత్రమే పరిమితమైందని, దాన్ని మభ్య పెట్టే ప్రయత్నానికి టీడీపీ తెర తీసిందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications