అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు
ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ వేళ ప్రతిపక్ష నేతలపై అధికార వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో లీక్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు పార్టీ మారడం తథ్యమని, ఆయనకు హోం మంత్రి పదవి తప్పక దక్కుతుందని సాయిరెడ్డి చెప్పారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, అటు సోషల్ మీడియా వేదికగానూ కీలక కామెంట్లు చేశారు.
ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?
అచ్చెన్నను చేరదీస్తారు..
ఏపీ టీడపీ చీఫ్ అచ్చెన్నాయుడు తిరుపతి లోని ఓ హోటల్ లో పార్టీకే చెందిన ఆకుల వెంకటేశ్వరరావుతో సంభాషించిన వీడియో ఒకటి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం, తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదు, లోకేశ్ బాగుంటే టీడీపీకి దుస్థితి వచ్చేదేకాదని అచ్చెన్న అన్నట్లుగా వీడియోలో రికార్డు కావడం, సదరు సంభాషణను వక్రీకరించారని, లోకేశ్ తో అనుబంధం విడదీయరానిదని అచ్చెన్న వివరణ ఇవ్వడం తెలిసిందే. 'శభాష్ అచ్చెన్న..' అంటూ వీడియో లీకేజీని పొగిడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అచ్చెన్నను ఆదరిస్తారంటూ తాజాగా ట్వీట్ చేశారు..
హోం మంత్రి పదవి పక్కా
''అచ్చెన్నా.. ఆ తండ్రీకొడుకుల మెప్పు కోసం ఎంత గులాంగిరి చేసినా ఎన్నటికీ హోం మంత్రి కాలేవని నీకూ తెలుసు. ఎందుకు సొల్లు స్టేట్ మెంట్లు. ఏ పార్టీలో చేరాలో ఇప్పటికే డిసైడై ఉంటావు. ఆ పార్టీ వారిని ప్రసన్నం చేసుకునే కిటుకులు ట్రై చేయి. మీ బాస్ లాగా! అన్నట్లు, ఉన్న మాటే అన్నావ్. బొక్కలో పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అని చిటికెలు వేసేయ్. మధ్యలో లోకేశ్ చంకలో దూరడం ఎందుకు. ఎద్దంత మనిషివి భయపడితే ఎలా అచ్చెన్నా. కొమ్ములతో కుమ్ముకుంటూ ముందుకు దూసుకుపో. ఏదో ఒక పార్టీ చేరదీస్తుంది. అప్పుడు నీ హోం మంత్రి కల నెరవేర్చుకో'' అని సాయిరెడ్డి రాసుకొచ్చారు.
లోకేశ్ అలక.. బాబు స్వీయ సత్కారం..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం గడువు, తన షెడ్యూల్ ముగియకుండానే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అలకబూని తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లెయిమ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్షుడిగా లేదంటే ప్రచార బాధ్యతలైనా ఇవ్వాలంటూ ఇటీవల కాలంలో టీడీపీ నేతలు గళం వినిపిస్తుండగాన్న కూడా ఎంపీ గుర్తుచేశారు. ''ప్రచారం ముగియకుండానే మాలోకం అలిగి హైదరాబాద్ వెళ్లి పోవడం, చంద్రబాబు తన శాలువాలు తనే కప్పుకుని స్వీయ సత్కారాలకు పాల్పడటం...! ఎక్కడో తేడా కొడుతోంది. అచ్చెన్న, బుచ్చయ్యలకు బాగా తెలుసు అదేంటో'' అని అనుమానం వెలిబుచ్చారు.
టీడీపీ కులపిచ్చి, బీజేపీ మతపిచ్చి...
చంద్రబాబు ఏదైనా చేయించుకోగలడని, చిన్న గులకరాయిని తన సభ మీద వేయించుకొని పెధ్ద రాద్ధాంతం చేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీకి జనసేన, టీడీపీ, బీజేపీలు అసలే పోటీనే కాదన్నారు. కుల పిచ్చితో అడ్డమైన అరాచకాలు చేసి చంద్రబాబు తన రాజకీయ పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడని, మతం పేరుతో విభజన తీసుకురావాలని ఆరాటపడుతున్న బీజేపీకీ అదే గతి తప్పదని మండిపడ్డారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి దళిత హిందు కాదని, క్రైస్తవ మతాన్ని పాటించే ఆయనను బీసీ-సీగా గుర్తిస్తూ, పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇతరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దరిమిలా వైసీపీ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ''పోలింగుకు రెండ్రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు? మీకంటే నిఖార్సైన హిందువు ఆయన'' అని బీజేపీకి కౌంటరిచ్చారు. అలాగే,
విశాఖకు రాజధాని వస్తోంది..
ఏపీలో మూడు రాజధానుల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండగా, త్వరలోనే ఏపీకి విశాఖ రాజధానిగా వస్తుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చేశారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, విశాఖలో 740 స్లమ్ ఏరియాలు ఉన్నాయని, ఇప్పుడు విశాఖ రాజధాని నగరంగా మారునున్నందున స్లమ్ లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్, భీమిలి 6 లైన్ల రోడ్లకు త్వరలోనే సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని, ఉత్తరాంధ్రలో నిరుద్యోగుల కోసం త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ఎంపీ సాయిరెడ్డి చెప్పారు.
శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే