ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. ఫిక్స్: లోక్సభతో పాటే
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు విడతల్లో 38 లోక్సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మూడో విడత జాబితాపై కసరత్తు పూర్తి చేసింది.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడుతుందని స్పష్టం చేశారు. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతాయని పేర్కొన్నారు.
1999 నుంచీ లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 వరకూ అయిదుసార్లు జమిలిని ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఏపీతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తారని, మార్చి రెండో వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందని అన్నారు.
2014, 2019లో కూడా మార్చి 15 లోపే ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందని గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు అదే ఏడాది మార్చి 5వ తేదీన ప్రకటన వెలువడిందని పేర్కొన్నారు. 2019 మార్చి 10వ తేదీన ఏపీతో లోక్సభకు ఎన్నికలను నిర్వహించడానికి ఈసీ తేదీలను వెల్లడించిందని గుర్తు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు.

జగన్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవడానికి ఏపీ ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తోన్నారని సాయిరెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందించిన తమ పార్టీని మరోసారి గెలిపించుకోవడానికి ఏపీ ఓటర్లు ఎంతో ఆతృత, ఆసక్తితో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
2019 మే 30వ తేదీన వృద్ధాప్య పింఛన్ పెంపు ఫైలుపై వైఎస్ జగన్ సంతకంతో మొదలైన వైఎస్ఆర్సీపీ పాలన దిగ్విజయంగా సాగుతోందని సాయిరెడ్డి అన్నారు. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక స్వావలంబనను కల్పించడానికి తమ ప్రభుత్వం వివిధ పథకాల కింద వారి బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటి వరకు 2,46,000 కోట్ల రూపాయలను బదిలీ చేసిందని వివరించారు.
అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు వంటి సంక్షేమ పథకాల ద్వారా 2.46 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం నేరుగా ప్రజలకు అందించిందని అన్నారు. ఇలాంటి ప్రజాహిత ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications