అంతర్వేది ఘటనపై కమిటీ వేసిన చంద్రబాబు స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఈగ వాలకుండా కాపాడారు :విజయసాయి ఫైర్
అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఆలయ ఇంచార్జ్ ఈవోపై చర్యలకు ఉపక్రమించింది సర్కార్. అంతర్వేది ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని చంద్రబాబు నిజ నిర్ధారణ కమిటీని వేశారు.
అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన నిజనిర్ధారణ కమిటీలో నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యరావు సభ్యులుగా ఉన్నారు. రథం దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు వారికి బాధ్యతలు అప్పగించారు. అంతర్వేది ఘటనపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అవుతున్న నేపథ్యంలో వైస్ వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. పలు ప్రశ్నలను సంధించారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే నోరుమెదపని చంద్రబాబు, అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజ నిర్ధారణ కమిటీ ఎలా వేశారు అంటూ ప్రశ్నించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే కనీసం నోరు కూడా మెదప లేదు ఎందుకని ప్రజలు అడుగుతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. రమేష్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
స్వర్ణ ప్యాలెస్ ఘటనపై అంతగా స్పందించని చంద్రబాబు, అంతర్వేది ఘటనపై ఇంత వేగంగా నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి వెనుక కారణమేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోపక్క వైసీపీ నేతలు, మంత్రులు అంతర్వేది ఘటన.. ప్రతిపక్షాల కుట్ర అన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల ఉద్దేశం కూడా అదే అన్న భావన కలిగేలా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.












Click it and Unblock the Notifications