ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్టయిన అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు దేశద్రోహంతో సమానమైన కేసులపై అరెస్టయిన రఘురామకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానమైన ఆరో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఈనెల 28 వరకు రిమాండ్ విధించగా, రిలీఫ్ కోసం ఎంపీ సుప్రీంను సైతం ఆశ్రయించడం తెలిసిందే. రఘురామరాజు పరిస్థితికి కారణాలు ఇవేనంటూ విజయసాయి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి..

రఘురామ పరిస్థితేంటి?
ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద రఘురామను శుక్రవారం అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికాలు.. ఎంపీని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. పాదాలు రెండూ కమిలిపోయేలా తాళ్లతో కట్టేసి, తీవ్రంగా కట్టారని, శారీరక, మానసిక హింసకు గురిచేశారని ఎంపీ రఘురామ ఆరోపించారు.
ఈ విషయమై ఆయన ఎంపీ పిటిషన్ వేయగా, కింది కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు చెప్పింది. దీంతో ఎంపీ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో జడ్జిల కొరత, సీరియస్ కేసులను మాత్రమే టేకప్ చేస్తున్నరీత్యా ఎంపీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సోమవారం తర్వాత విచారణ జరుగుతుందా, లేదా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం మంగళగిరి సీఐడీ ఆఫీసులో రిమాండ్ లో ఉన్న రఘురామకు వైద్య పరీక్షలు జరపనున్నారు. ఆయన ఒంటిపై గాయాలను మెజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. ఇదిలా ఉంటే,

కరోనా ఉంటే అరెస్టు చేయొద్దా?
ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన సహచరుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రఘురామ ఇప్పటికే వైసీపీ ఎంపీగానే కొనసాగుతుండటాన్ని గుర్తుచేస్తూ, మా వాణ్ని మా పోలీసులే అరెస్టు చేయడం గొప్ప విషయానికి తక్కువకాదన్నారు. కరోనా విలయం కొనసాగుతున్నంత మాత్రన అరెస్టులు కూడదా? అని ఎదురుప్రశ్నించారు. ''ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసినందుకు అధికార పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా అరెస్టు చేసిన పోలీసులను అభినందించాల్సింది పోయి, పచ్చ పార్టీ డొల్ల వాదనలు చేస్తోంది. అంతలా అభిమానించే వాళ్లు ఇన్నాళ్లు నోరు జారుతుంటే ఒక్కరైనా వారించారా. అయినా కరోనా వచ్చిందని పోలీసులు పనిచేయకూడదా?'' అని ఎంపీ రాసుకొచ్చారు. అలాగే
Recommended Video

చంద్రబాబు వాడకంలో దిబ్బ రాజు..
ఎంపీ రఘురామ ప్రస్తుత పరిస్థితికి ఆయనను టీడీపీ చీఫ్ చంద్రబాబు వాడుకోవడమే కారణమని సాయిరెడ్డి సూత్రీకరించారు. వైసీపీ ఎంపీ అరెస్టును టీడీపీ చీఫ్ ఖండించడం తెలిసిందే. ''చంద్రబాబు కోసం ఆడి పాడిన పోతురాజులు ఇప్పుడెన్ని ఆర్తనాదాలు చేసినా తలుపులు బిగించుకుని స్వీయ నిర్బంధంలో ఉన్న వాడికి వినిపించవు. ఆయన ఉసిగొల్పాడని చెలరేగిపోయారు.
అందరినీ పళ్లతో పీకాలని చూశారు. బాబు వాడకంలో బాగుపడ్డోడే లేడని తెలుసుకునేసరికి జైలు ద్వారాలు స్వాగతం పలుకుతున్నాయి'' అని సాయిరెడ్డి అన్నారు. రఘురామ వ్యవహారంలో నారా లోకేశ్ రియాక్షన్ కూ వైసీపీ ఎంపీ కౌంటరిచ్చారు. '' పప్పూ... నిన్ను చూస్తే జాలేస్తోంది! మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు...గరుడ పురాణాన్ని నమ్మాడు...చెప్పులు పార్టీని నమ్మాడు... చివరికి దిష్టి రాజు దిబ్బ రాజును కూడా నమ్మాడు...నిన్ను మాత్రం నమ్మలేదు! అయినా, పప్పూ... నువ్వు మాత్రం మీ నాన్ననే నమ్ము'' అని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications