రాజీనామాల ఆమోదం?: లోకసభ స్పీకర్ను కలవనున్న జగన్ పార్టీ ఎంపీలు
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాల ఆమోదం విషయంపై మంగళవారం సాయంత్రం లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలవనున్నారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరనున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసంలో సమావేశమవుతారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6నే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరతామని చెప్పారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ఉపఎన్నికలంటేనే బాబు జంకుతున్నారని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకుపుడుతోందని మేకపాటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతోనైనా.. లేదంటే మరోసారి ప్రధాని మోడీతో జత కట్టడానికైనా చంద్రబాబు వెనుకాడరని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.